ప్రతిపక్షాల నిరసనల మధ్య వీబీ జీ రామ్ జీ బిల్లు ఆమోదం

ప్రతిపక్షాల నిరసనల మధ్య వీబీ జీ రామ్ జీ బిల్లు ఆమోదం
 
‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న ‘వికసిత్‌ భారత్‌ రోజ్‌ గార్ ఆజీవికా హామీ మిషన్‌ గ్రామీణ్‌’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్యే వీబీ జీ రామ్‌ జీ బిల్లుకు ఆమోదం లభించింది. ఆమోద సమయంలో వెల్‌లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు ప్రతులు చించి విసిరేశారు. బిల్లు ఆమోదం తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది.

బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడిన కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలు కార్మికులపై ఎక్కువగా ఖర్చు చేసి అభివృద్ధి పనులకు తక్కువగా ఖర్చుచేశాయని తెలిపారు. యూపీఏ కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా నరేగా మాదిరి ఉపాధి గ్యారంటీ పథకాలను ప్రారంభించాయని పేర్కొన్నారు. 

2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేగా పథకానికి మహాత్మా గాంధీ పేరును అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్టిందని శివరాజ్‌సింగ్ ఆరోపించారు. భారత్‌-పాకిస్థాన్ విభజనకు ఒప్పుకొని గాంధీ ఆదర్శాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడించిందని విమర్శించారు. అంతకు ముందు వీబీ జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు నిరసన తెలిపాయి. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌తో గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు.  ఇందులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, కనిమెుళి, టీఆర్ బాలు, ఏ. రాజా తదితర పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఎంపీ కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు. 

వీబీ జీ రామ్ బీ బిల్లును పార్లమెంటు స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానించడమే కాకుండా, గ్రామాల్లో సామాజిక, ఆర్థిక పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పని హక్కును కూడా అణచివేసిందని మల్లికార్జు ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఎక్స్​లో పోస్ట్ చేశారు.