2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్
 
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు సందర్భంగా విడుదల చేసిన  తెలంగాణ విజన్‌-2047 డాక్యుమెంట్ ను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.  తెలంగాణలో వివక్ష, పేదరికాన్ని నిర్మూలించడమే తమ ప్రజా ప్రభుత్వ ధ్యేయమనీ, విద్య, వ్యవసాయ, కమ్యూనికేషన్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని తెలిపారు. 
తెలంగాణ సుస్థిర, సమ్మిళత అభివృద్ధికి బాటలు వేసేలా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ దార్శనిక పత్రంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను వంద నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నామనీ, ఒక్కోదాన్ని 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని తెలిపారు. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

కాగా, రెండు రోజుల తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్‌ఫ్రాకీ డిసి పార్క్స్‌ రూ.70 వేల కోట్లలతో 150 ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. జేసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్లలతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. ఏసీపీ గ్రూప్ రూ.6,750 కోట్లతో ఒక గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది.

బయోలాజికల్ ఇ లిమిటెడ్ టీకాలు, పరిశోధన–అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్లలతో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ రూ.1,100 కోట్లలతో ఫ్రీజ్–డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపించనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.

ఆర్​సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్లలతో పెట్టుబడులు పెట్టనుంది. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అరబిందో ఫార్మా రూ.2000 కోట్లలతో కంపెనీ విస్తరణకు ఒప్పందం చేసుకుంది. గ్రాన్యూల్స్ ఇండియా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్ బయోటెక్ రూ.1000 కోట్లలతో పరిశోధన, అభివృద్ధి, తయారీ, సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనుంది. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.