మునీర్ ను అమెరికా అరెస్టు చేసి ఉండాల్సింది

మునీర్ ను అమెరికా అరెస్టు చేసి ఉండాల్సింది

* పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇటీవలే అమెరికాకు వచ్చినప్పుడు గౌరవించడానికి బదులు అరెస్టు చేసి ఉండాల్సిందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) మాజీ అధికారి మైఖెల్ రూబిన్ సంచలన వాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్‌లో మునీర్‌కు వైట్‌హౌస్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. 

గత ఏడాది కాలంగా తప్పుడు విధానాలను అనుసరిస్తున్నందుకు, 50 శాతం దిగుమతి సుంకాలను విధించినందుకు భారత్‌కు అమెరికా మౌఖిక క్షమాపణలు చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  అయితే క్షమాపణలు చెప్పడానికి ట్రంప్ ఇష్టపడరని, కానీ ఒక వ్యక్తి అహంభావం కంటే అమెరికా, ప్రపంచ ప్రజాస్వామిక దేశాల ప్రయోజనాలే చాలా ముఖ్యమైనవని రూబిన్ తెలిపారు. 

అహంభావాన్ని పక్కన పెట్టి, ట్రంప్ సారీ చెప్పాలని హితవు చెప్పారు. రష్యా నుంచి చమురును కొంటున్నందుకు, ఆగస్టు నెలలో భారత్‌పై అదనపు దిగుమతి సుంకాన్ని అమెరికా ప్రభుత్వం విధించడం సబబు కాదని ఆయన చెప్పారు. ట్రంప్ సర్కారు భారత్‌ లాంటి మిత్రదేశాన్ని వదిలేసి, పాకిస్థాన్ లాంటి దేశాన్ని అక్కున చేర్చుకోవడంలో వ్యూహాత్మకమైన లాజిక్ ఏదీ లేదని ఆయన ధ్వజమెత్తారు. 

నాటోయేతర అమెరికా ప్రధాన మిత్రదేశం అయ్యే అర్హత పాక్‌కు లేదని రూబిన్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా పాకిస్థాన్‌ను గుర్తించి తీరాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ ఆసిమ్ మునీర్ అమెరికాకు వస్తే, అరెస్టు చేయాలని హితవు చెప్పారు.

పుతిన్ భారత్ పర్యటన అమెరికా అసమర్ధత

 
“భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజా పర్యటన అనేది అమెరికా సర్కారు అసమర్ధత, వైఫల్యంగానే కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ ప్రజలు ట్రంప్‌ను ఇష్టపడటం లేదు. ట్రంప్‌ను వ్యతిరేకించే అమెరికన్లు దాదాపు 65 శాతం దాకా ఉన్నారని ఇటీవలే సర్వేలలో వెల్లడైంది. ట్రంప్ సర్కారు నిర్ణయాలను, విధానాలను ప్రజలు ఇష్టపడం లేదు” అని ఆయన విమర్సించారు. 
 
“భారత్ లాంటి మిత్రదేశాన్ని రష్యాకు ట్రంప్ వదిలేయడాన్ని అమెరికన్లు అసలు స్వాగతించరు. ట్రంప్ వరుసగా తప్పులు చేస్తున్నారు. కానీ వాటిని ఒప్పుకునే సాహసం చేయడం లేదు. నీతులను మనం పాటించకుండా, పాటించమని ఇతరులకు చెప్పడం సరికాదు. రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌కు అమెరికా హితబోధనలు అలాగే ఉన్నాయి” అని ఎద్దేవా చేసారు. 
 
దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ చౌక ధరకు వచ్చే రష్యా చమురు కొనుగోలుకు భారత్ ప్రయారిటీ ఇవ్వడం సరైన నిర్ణయం అని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ స్పష్టం చేశారు.