దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది. ఆ దేశానికి మానవతా సహాయంగా పాకిస్థాన్ మందులు, ఆహారపదార్ధాలు, అత్యవసర సామగ్రిని పంపింది. అయితే ఎక్స్పైరీ అయిన మందులు, పాచిపోయిన ఆహార పదార్ధాలు, నాసిరకం సామగ్రి అందులో ఉండటం పట్ల శ్రీలంక దౌత్య వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
కొలంబోకు పంపించే ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను పాక్ హైకమిషన్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ చిత్రాలను పరిశీలించగా ప్యాకెజీలపై 10 వ తేదీ 2024తో వాటి గడువు ముగిసినట్టు లేబుల్ కనిపించింది. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గడువు తీరిన పదార్థాలను సహాయార్థం ఇచ్చినందుకు సోషల్ మీడియాలో పాక్పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ చర్యల ద్వారా శ్రీలంకను పాక్ అవమానపరిచిందని నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక అధికారులు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ పాకిస్థాన్ స్పందించలేదు. పాకిస్తాన్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, 2021లో, తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో భారతదేశం పాకిస్తాన్ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయాన్ని పంపినప్పుడు, సహాయ సామగ్రి దెబ్బతిన్న, కలుషితమైన స్థితిలోకి వచ్చిందని కాబూల్ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ రవాణా సామాగ్రిని నిర్వహించడంపై ప్రశ్నలు తలెత్తాయి.

More Stories
ఇమ్రాన్ ఖాన్ ను మానసికంగా వేధిస్తున్నారు
విషమంగా ఖలేదా జియా ఆరోగ్యం.. ప్రధాని మోదీ ఆందోళన
శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ భరోసా