కోమటిరెడ్డి చొరవతో మునుగోడులో ఊరి బైట మద్యం షాపులు

కోమటిరెడ్డి చొరవతో మునుగోడులో ఊరి బైట మద్యం షాపులు
మునుగోడు నియోజకవర్గం లో మద్యం షాపుల నిర్వహణ విషయంలో  శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాటనెగ్గించుకున్నారు. తన మాట  ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు.  సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు.
మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. వీలైతే స్థానికంగా ఉన్న  వ్యక్తులే మద్యం టెండర్లు వేసి దక్కించుకునేలా  ప్రోత్సహించారు. మద్యం టెండర్ల డ్రాలో  కొన్ని మద్యం షాపులు స్థానికులు, మరికొన్ని స్థానికేతరులు దక్కించుకున్నారు..
 
మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాదులోని తన నివాసంలో  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి మద్యం షాపులను మధ్యాహ్నం 1:00 తర్వాత తెరవాలని,  6 గంటల నుండి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించారు. 
రాజగోపాల్ రెడ్డి సూచించిన అంశాలకు లోబడి మద్యం షాపులు నిర్వహిస్థామని మాట ఇచ్చారు మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు మంగళవారం నుండి నియోజకవర్గ వ్యాప్తంగా  కొత్త మద్యం షాపులు ప్రారంభించారు.
 
ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే మద్యం వల్ల  ఎంతోమంది యువకులు తాగుడుకు బానిసై  తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న  తీరును చూసి, విచ్చలవిడిగా మద్యం సేవించి  గ్రామాలలో అకారణంగా ఘర్షణలకు తావిస్తున్న తీరును చూసి,  మద్యానికి బానిసై అనారోగ్యాలకు  గురై ప్రజలు చనిపోతున్న సంఘటనలు చూసి చలించి ఈ విధంగా చేస్తున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.