రాజధానిని గుర్తిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం

రాజధానిని గుర్తిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, ఈ అంశంపై కేంద్రంతో మరోసారి చరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైనా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత సుమారు 20 నెలల అనంతరం మొదటిసారిగా గురువారం రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఐదో బ్లాకులో సమావేశమయ్యారు. 
 
రైతుల తమకున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘జరీబు, గ్రామ కంఠాలు, లంక భూములు, రిటర్నబుల్ ప్లాట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి. లంక భూములను పూలింగ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి. అవసరమైతే నేనూ మీతో మాట్లాడతాను. ఇకపై రెగ్యులర్‌గా అమరావతి రైతుల సమస్యలపై సమీక్షిస్తాను” అని  వెల్లడించారు.

“రైతులతో మనస్సు విప్పి మాట్లాడాలి. కాబట్టి అన్ని చెబుతున్నా. అమరావతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఉండాలి. రాజధాని అభివృద్ధి చెందాలి. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలి. అమరావతి ప్రాంతానికి, రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత. నా హయాంలో ఎప్పుడూ భూ సేకరణలో ఇబ్బందులు రాలేదు” అంటూ భరోసా ఇచ్చారు. 

 
“భూముల ధరలు పెరగబోతున్నాయి. రిటర్నబుల్ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దు. తిరుమల తరహాలో అమరావతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. బిట్స్ పిలానీ, క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతున్నాయి. అధ్భుతమైన అభివృద్ధి జరగబోతోంది. తిరుపతి సమీపంలో 5 వేల ఎకరాలు ప్రభుత్వానికి లభించింది. అక్కడ ఎరో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. రెండో విడతలోనూ ల్యాండ్ పూలింగులో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం” అని చంద్రబాబు చెప్పారు. 
 
“అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌ను చూస్తే అర్థమవుతుంది. గతంలో అక్కడ చాలా తక్కువ ధరలో ఉండే భూములు ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు చేరింది. కొందరు రైతులు ఎఫ్ఎస్ఐ పెంచాలని కోరుతున్నార. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను. రైతులు చెప్పే ఏ సమస్యనైనా వీలైనంతవరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే అందరూ కలిసి కట్టుగా ఉండాలి.  ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం” అని సీఎం చెప్పారు.

సీఎంతో సమావేశం సందర్భంగా రైతులు మాట్లాడుతూ ‘రాజధాని కోసం జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఉద్యమించాం. ఇక అమరావతి డెవలెప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం. రెండో విడత భూ సమీకరణకు పూర్తిగా సహకరిస్తాం. సీఎం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే మాకూ మేలు జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది” అని తెలిపారు. 
 
ఎఫ్ఎస్ఐ పెంపు వల్ల కలిగే లాభనష్టాలను వివరించే బాధ్యత సీఆర్డీఏ తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. రైతులకు కొన్ని అంశాల్లో సరైన అవగాహన లేదని చెబుతూ  ఏదైనా ఇబ్బంది అయితే నష్టం రైతులకే కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మున్సిపల్, సీఆర్డీఏ శాఖల ఉన్నతాధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.