మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మవద్దు!

మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మవద్దు!
అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హితవు చెప్పారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారనీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారనీ, వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారనీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి చేసేదొకటి, వారి మాటలు నమ్మి మోసపోవద్దనీ, మంచి ఆలోచనలతో సమాజంలోకి వచ్చి, ప్రజలకు సేవ చేయలని ఆయన  పిలుపునిచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో  కలవడానికి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు. 

వచ్చే మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని సంజయ్ పునరుద్ఘాటించారు. మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను పోలీసులను చంపారనీ, జాతీయ జెండా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చంపారనీ ఆయన గుర్తు చేశారు. 

మావోయిజాన్ని అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేస్తూ ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోయి ప్రజా స్రవంతిలో కలవాలని కోరారు. వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల అంతం తధ్యమని తేల్చి చెప్పారు. మావోయిస్టులలో తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందనీ చెప్పారు. బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదనీ, బ్యాలెట్ ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సంజయ్ తెలిపారు.

కాగా, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని బండి సంజయ్‌ చెప్పారు. ఈ ఫలితం హిందువులకు గుణపాఠం అయిందని పేర్కొంటూ హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలో ఇతర మతాల్లో చేరిన హిందువులంతా ఘర్‌ వాపసీ రావాలని పిలుపునిచ్చారు. వారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు.
 
మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టేనని చెబుతూ అన్ని కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమానికి పాటు పడుతూనే హిందూ ధర్మం కోసం పని చేయాలని సూచించారు. రాజకీయాలు, పదవులు, ప్రజల కోసం కుల సంఘాలు వేర్వేరుగా ఉన్నా దేశం కోసం, ధర్మం కోసం ఒక్కటి కావాలని కోరారు.