విజయవాడ, కాకినాడలలో 31 మంది మావోయిస్టులు అరెస్టు

విజయవాడ, కాకినాడలలో 31 మంది మావోయిస్టులు అరెస్టు
మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌ వేళ విజయవాడ, కాకినాడలలో మావోయిస్టుల కలకలం రేగింది.  మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో విజయవాడ, కాకినాడ నగరాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్హా తెలిపారు.
 
విజయవాడలోని కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్‌లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీమారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డెయిరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు తెలిసింది. 
 
దాదాపు రెండు మూడు బస్సుల్లో పోలీసు బలగాలు వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నాలుగు అంతస్తుల భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, పరిశ్రమలను మూసివేసి తనిఖీలు చేపట్టారు.  వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్టు సమాచారం.
 
“మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండ్రోజులుగా ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశాం.” అని లడ్డా తెలిపారు.

సోదాల్లో 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. విజయవాడలో అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున జరుగుతున్న కూంబింగ్‌తో అక్కడి నుంచి మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌గా ఏపీకి వచ్చినట్లు సమాచారం.