పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన అధికారి మృతి

పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన అధికారి మృతి

తిరుమల పరకామణి కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ  మాజీ సహాయ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌లో ఆయన విగతశరీరంగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్‍స్పెక్టర్‍గా పనిచేస్తున్నారు.

ముఖ్యంగా కేసు కీలక దశలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. గతంలో, తిరుమల పరకామణి ఘటనలో
హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్‌ విదేశీ డాలర్లను చోరీ చేస్తుండగా సతీష్‌కుమార్‌ పట్టుకొని  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడు న్యాయస్థానానికి హాజరు అయ్యాడు. 

2023 మే 30న రవికుమార్‍పై  విజిలెన్స్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే, కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదించడంతో అతని ఆస్తులపై కన్నేసిన వైసిపి నేతలు రవికి చెందిన కొన్ని ఆస్తులను విరాళంగా తీసుకుంటున్నల్టు టిటిడి బోర్డులో తీర్మానం చేశారు.

తాజాగా, కేసు తిరిగి విచారణకు వచ్చింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. విచారణ కీలక దశలో ఉన్న సమయంలో, కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీశ్ కుమార్ రైల్వే ట్రాక్‌పై మృతంగా కనిపించడం, కుట్ర కోణాన్ని సూచిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో పరకామణి కేసు మరోసారి మీడియా వార్తల్లో ప్రాముఖ్యత పొందింది.