సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దేశంలోని ఆలయాల సమస్యల పరిష్కరం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. లౌకికవాదం రెండు మార్గాల్లో ఉంటుందని చెబుతూ మత విశ్వాసాల రక్షణ, గౌరవం అంశంలో రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
దేశం మొత్తంమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడేందుకు సమయోచిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మన సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైందని, నాగరికతతో ఆ ధర్మం వర్థిల్లుతున్నదని తెలిపారు. ఇలాంటి సమయాల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని స్పష్టం చేస్తూ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం కోసం ఆ బోర్డు ఉండాలని పేర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం యాత్రా స్థలం మాత్రమే కాదని, అది పవిత్ర ఆధ్యాత్మిక యాత్రకు కేంద్రమని తెలిపారు. తిరుపతి లడ్డూ కేవలం స్వీటు మాత్రమే కాదని, అదొక భావోద్వేగం అని చెప్పారు. మన స్నేహితులు, కుటుంబీకులు, దగ్గరవారికి ఆ లడ్డూను ఎంతో ప్రేమతో పంచిపెడుతామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఇది మనలో ఉన్న సామూహిక నమ్మకానికి, విశ్వాసాన్ని చాటుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది సగటును 2. 5 కోట్ల మంది భక్తుల తిరుమలను దర్శించుకుంటారని, సనాతన విధానాలు అవలంబిస్తున్న వారి మనోభావాలను దెబ్బతీయాలని చూసినా, లేక హేళన చేసినా, అది కేవలం బాధను మాత్రమే కలిగించదని, లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల కేవలం పుణ్యక్షేత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. అక్కడి లడ్డూ కేవలం ప్రసాదం కాదు, అది ఆధ్యాత్మికతకు ప్రతీక,” అని తెలిపారు. తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తుల విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
“ఆ విశ్వాసాన్ని ఎగతాళి చేయడం అంటే ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీయడం లాంటిదే,” అని పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. సనాతన ధర్మ భావాల పట్ల గౌరవం, సంరక్షణ ప్రతి భారతీయుడి ధర్మమని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలు, ఆచారాలు, సంప్రదాయాలను సంరక్షించే దిశగా చర్యలు చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఈ బోర్డు ద్వారా ధార్మిక కేంద్రాల నిర్వహణ, భక్తుల సేవా కార్యక్రమాలు మరింత పటిష్టం అవుతాయని ఆయన భావిస్తున్నారు. తిరుపతి లడ్డూపై ఓ పత్రిక రాసిన కథనాన్ని ఎక్స్ లో పంచుకొంటూ, టీటీడీ లడ్డూ తయారీ కోసం ఉత్తరాఖండ్కు చెందిన డెయిరీ సంస్థ నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్లు ఆ కథనం పేర్కొన్నదని తెలిపారు.
ఒక్క పాలచుక్కను కూడా సేకరించని ఆ సంస్థ ఎలా 68 లక్షల కేజీ నెయ్యిని సరఫరా చేసిందని కథనంలో ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు ఆ డెయిరీ సంస్థ సుమారు 250 కోట్ల ఖరీదైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

More Stories
ఆర్థిక పాలన నమూనాను సరిగ్గా అర్థం చేసుకోండి!
ఢిల్లీ పేలుడులో సూత్రధారులు ఐదుగురు వైద్యులు!
బిహార్లో మళ్లీ ఎన్డీయేదే విజయం.. ఎగ్జిట్ పోల్స్