‘ఓటు వేసే హక్కు’ ‘స్వేచ్ఛా ఓటింగ్‌’ కంటే భిన్నం

‘ఓటు వేసే హక్కు’ ‘స్వేచ్ఛా ఓటింగ్‌’ కంటే భిన్నం
ఒక ఎన్నికలో ‘ఓటు వేసే హక్కు’, ‘స్వేచ్ఛా ఓటింగ్‌’ కంటే భిన్నంగా వుంటుందని సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వం వాదించింది. ఇందులో మొదటిది కేవలం చట్టబద్ధమైన హక్కు అయితే, రెండోది ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని పేర్కొంది. జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందు ఈ కేసు గురువారం విచారణకు లిస్ట్‌ అయింది. కానీ బెంచ్‌ సమావేశం కాలేదు. 
 
గురువారం నాడే బీహార్‌ అసెంబ్లీ తొలి దశ పోలింగ్‌ జరగడం కూడా గమనార్హం. ఎలాంటి పోల్‌ నిర్వహించకుండా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఇచ్చిన డిక్లరేషన్‌ వల్ల ప్రజలు నోటా ఆప్షన్‌కు ఓటు వేసే హక్కును ఉపయోగించుకోలే కపోయారని పిటిషనర్లు వైది సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ల తరపున న్యాయవాదులు హర్ష పరాశర్‌, ప్రశాంత్‌ భూషణ్‌, నేహా రథి వాదించారు. 
 
ఎలాంటి పోల్‌ చేపట్టకుండా ఒక అభ్యర్ధిని గెలుపొందినట్లు డిక్లేర్‌ చేయడమనేది నోటాకు ఓటు వేయడం ద్వారా తమ అసంతృప్తిని తెలియచేయడానికి ఓటర్లకు గల హక్కును ఉల్లంఘిస్తుందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ రెండూ స్పందించాయి. దీనిపై ఓటు హక్కు, స్వేచ్ఛా ఓటింగ్‌కు మధ్య గల తేడాను వివరిస్తూ కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 
 
ఓటు హక్కు అనేది ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 62 కింద కల్పించబడిన చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. ఓటు వేసే స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద గల భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని పేర్కొంది. ఈ తేడాను వివరిస్తూ కేంద్రం, 2003 నాటి సివిల్‌ లిబర్టీస్‌ (పియుసిఎల్‌) వర్సెస్‌ కేంద్రం కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించింది.