డిజిట‌ల్ అరెస్టు కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి

డిజిట‌ల్ అరెస్టు కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి

* భారత్ లో రూ 3 వేలకోట్లకు పైగా డిజిటల్ మోసాలు

డిజిటల్‌ అరెస్టులు ఓ కుంభకోణం స్థాయికి చేరుకున్నాయని, ఇప్పటివరకు భారత్‌లోనే రూ.3వేల కోట్లకు పైగా మొత్తాలను బాధితుల నుండి మోసగాళ్లు కొల్లగొట్టారని సుప్రీంకోర్టు పేర్కొంది. అది కూడా మెజారిటీ సంఖ్యలో వృద్ధులను లక్ష్యంగా చేసుకునే ఇదంతా జరిగిందని, వీటిని అరికట్టే సంస్థల బలోపేతానికి కఠినమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. 
 
కేంద్ర ప్రభుత్వం అందజేసిన విశ్వసనీయమైన నివేదికను ప్రస్తావిస్తూ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని బెంచ్‌ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. డిజిటల్‌ అరెస్టులనేది చాలా పెద్ద సవాలుగా మారిందని ఈ నివేదికను చూస్తుంటే అర్థమవుతోందని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. మనం అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువగా ఈ సమస్య పాతుకుపోయిందని పేర్కొన్నారు. 
 
మోసం జరుగుతున్న తీరు, పరిధి చాలా విస్తృతంగా వుందని నివేదికను చూస్తే తెలుస్తోందని తెలిపారు. ఒక్క భారతదేశంలోనే రూ.3వేల కోట్లకు పైగా మొత్తాలను బాధితుల నుండి వసూలు చేశారంటే ఇక అంతర్జాతీయ స్థాయిలో ఎలా వుంటుందో ఆలోచించుకోవచ్చన్నారు. ఊహించిన దానికన్నా మించి డిజిటల్‌ అరెస్టు కుంభకోణం స్థాయి వుందని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యలతో కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఏకీభవించారు. 
 
ఇటువంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు న్యాయ వ్యవస్థ చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేస్తుందని, ఇందుకు అందరి మద్దతు కావాలని జస్టిస్‌ కాంత్‌ చెప్పారు. మనీ లాండరింగ్‌ ముఠాలే ఈ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాయని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి చెప్పారు. సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్న మోస‌గాళ్లు త‌మ‌కు తాము భ‌ద్ర‌తా సిబ్బందిగా, కోర్టు అధికారులుగా, ప్ర‌భుత్వాధికారులు ప‌రిచ‌యం చేసుకుని బెదిరింపులకు పాల్ప‌డుతున్నారు. 

ఆడియో, వీడియో కాల్స్‌తో బాధితుల‌ను పీడిస్తున్నారు. బాధితుల‌ను కాల్స్‌తో బందీలుగా చేసి డ‌బ్బులు చెల్లించేలా వ‌త్తిడి తెస్తున్నారు. చీఫ్ జ‌స్టిస్ సూర్య కాంత్‌, ఉజ్వ‌ల్ భుయాన్‌, జోయ్‌మాలా బాగ్చిల‌తో కూడిన ధ‌ర్మాసనం డిజిట‌ల్ అరెస్టు కేసుల‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ విష‌యంలో కోర్టుకు సూచ‌న‌లు చేసేందుకు అమిక‌స్ క్యూరీని నియ‌మించారు. కేంద్ర హోంశాఖ‌, సీబీఐ స‌మ‌ర్పించిన రెండు నివేదిక‌ల‌ను కోర్టు ప‌రిశీలాలించింది.

డిజిట‌ల్ అరెస్టుల కేసుల‌పై న‌వంబ‌ర్ 10వ తేదీ మ‌ళ్లీ విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. అమిక‌స్ క్యూరీ ఇచ్చే సూచ‌న‌ల ఆధారంగా కొన్ని ఆదేశాలు ఇవ్వ‌నున్న‌ట్లు కోరింది. సిండికేట్ నేర‌గాళ్లు ఆఫ్‌షోర్ లొకేష‌న్ల నుంచి ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని సీబీఐ త‌న రిపోర్టులో చెప్పిన‌ట్లు జ‌స్టిస్ కాంత్ పేర్కొన్నారు. కేంద్రం, సీబీఐ త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదించారు. కేంద్ర హోంశాఖ‌కు చెందిన సైబ‌ర్ డివిజ‌న్ ఇలాంటి కేసుల్ని డీల్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

హ‌ర్యానాకు చెందిన ఓ మ‌హిళ సీజేఐ బీఆర్ గ‌వాయ్‌కి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును వాదిస్తున్నారు. త‌ప్పుడు కోర్టు ఆదేశాల‌ను చూపిస్తూ నేర‌గాళ్లు ఫ్రాడ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమె ఆరోపించింది. ఆ వృద్ధ మ‌హిళ నుంచి నేర‌గాళ్లు కోటికిపైగా లూటీ చేశారు. సీబీఐ, ఈడీ, జుడిషియ‌ల్  అధికారులమ‌ని చెప్పి ఆడియో, వీడియో కాల్స్‌తో బెదిరించార‌ని ఆమె పేర్కొన్న‌ది. అంబాలాలో ఈ ఘ‌ట‌న‌పై రెండు కేసులు న‌మోదు అయ్యాయి.