చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి

చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది దుర్మరణం చెందారు.  మరో 12 మంది వరకు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా పోలీసులు నిర్ధరణకు వచ్చారు. మితిమీరిన అతివేగంతో టిప్పర్ లారీ నడపటం.. అది స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతోనే ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ముందు ఆర్టీసీ బస్సు కుడి వైపు అంటే డ్రైవర్ సీటును చీల్చుకుంటూ వెళ్లింది. బస్సు‌ రైట్ సైట్ సగం వరకు టిప్పర్ పడిపోయింది. 
 
ఆ సమయంలో లారీలో దాదాపు 15 నుంచి 20 టన్నుల వరకు కంకర ఉండగా అది పూర్తిగా ప్రయాణికులపై పడిపోయింది. దీంతో కుడివైపు కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంతోనే మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.  ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూడు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 

తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో చదువుతున్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్‌ పడిపోవడంతో డ్రైవర్‌ వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

ఇక బస్సుకు ఎడమ వైపు కూర్చున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వారు కూడా సగం వరకు కంకరలో కూరుకుపోగా.. పోలీసులు జేసీబీల సాయంతో కంకరను పక్కకు తొలగించి వారిని రక్షించారు. అనంతరం అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలిసింది. అయితే వారి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది.  ఎమ్మెల్యే కాలె యాదయ్య బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తర్వాత ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు.  స్థానికులు నిరసన తెలపడంతో ఘటన స్థలం నుంచి ఎమ్మెల్యే కాలె యాదయ్య వెళ్లిపోయారు.