‘మొంథా’ తుపాను ప్ర‌భావం, స‌న్నద్ధ‌త‌పై నడ్డా ఆరా

‘మొంథా’ తుపాను ప్ర‌భావం, స‌న్నద్ధ‌త‌పై నడ్డా ఆరా

మొంథా తుఫాను ముంచుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా, దాదాపు 18గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జేపీ న‌డ్డా ‘మొంథా” తుపాను ప్ర‌భావంపై ఆరాతీసారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌లకు సోమ‌వారం రాత్రి ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌కుమార్ మొంథా ప్ర‌భావం 17 జిల్లాల‌పై క‌నిపించే అవ‌కాశ‌ముంద‌ని చెప్పారు.  తుపాను ప్ర‌భావాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. వైద్యారోగ్య శాఖ కూడా ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో అవ‌స‌ర‌మైన చోట్ల  ప్ర‌జ‌ల‌కు సేవలందించేలా కార్యాచరణ సిద్ధం చేసిందని నడ్డాకు వివరించారు.

కాగా, తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో  బిజెపి శ్రేణులును అప్రమత్తం చేసి సహాయక చర్యలుకు సన్నద్దం చేయాలని జెపి నడ్డా పివిఎన్ మాధవ్ ను ఫోన్ లో ఆదేశించారు. బిజెపి నేతలతో పర్యవేక్షణ చేసే దిశగా సమాయాత్తం చేయాలని సూచించారు. జెపి నడ్డా సూచనలతో అందుబాటులో ఉన్న నేతలు, తుఫాన్ ప్రభావం ఉన్న 10 జిల్లాలకు చెందిన బిజెపి క్షేత్ర స్థాయి నేతలతో అత్యవసర ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని రాత్రి పగలు తేడా లేకుండా సేవా కార్యక్రమాలు కు సిద్ధంగా ఉండాలని మాధవ్ పిలుపు ఇచ్చారు. రెవెన్యూ అధికారులుతో సమన్వయం చేసుకుని బిజెపి నేతల ఫోన్ నెంబర్ లను సైతం తుఫాన్ ప్రభావం ఉన్న ప్రజలుకు చెప్పడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం చేయాలని పేర్కొన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీస్తాయని, అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలు కు నష్టాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ అందువల్ల నష్ట తీవ్రతను తగ్గించే విధంగా ప్రజలకు బిజెపి శ్రేణులు చేరువ కావాలని మాధవ్ కోరారు.