విద్యార్థులే లేని 7,993 పాఠశాలల్లో 20,817 మంది ఉపాధ్యాయులు

విద్యార్థులే లేని 7,993 పాఠశాలల్లో 20,817 మంది ఉపాధ్యాయులు
* విద్యార్థులు లేని స్కూళ్ల జాబితాలో బెంగాల్, తెలంగాణ అగ్రగామి

మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, బట్టలు, స్మార్ట్ క్లాస్ రూమ్‌లు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు విస్తృత చర్చకు దారితీశాయి.
2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జీరో ఎన్‌రోల్‌మెంట్’ నమోదైందని కేంద్రం ప్రకటించింది. 
ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమ బెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ  2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే, విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 17,965 మంది ఉండగా, తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించారు.

“పాఠశాల విద్య అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం; పాఠశాలల్లో సున్నా నమోదు సమస్యను పరిష్కరించాలని రాష్ట్రాలకు సూచించాము. కొన్ని రాష్ట్రాలు మౌలిక సదుపాయాలు, సిబ్బంది వంటి వనరులను గరిష్టంగా వినియోగించుకోవడానికి కొన్ని పాఠశాలలను విలీనం చేశాయి” అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.  తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దమన్‌ దీవ్- దాద్రానగర్ హవేలీ, చండీగఢ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలు ఒక్కటి కూడా లేవు.  అలాగే హరియాణా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి పాఠశాలలు సున్నాగా నమోదు అయ్యాయి. ఈ గణాంకాలు ఆయా రాష్ట్రాల్లోని విద్యా నిర్వహణ విధానాల సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954గా ఉండగా, ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గడం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో 81 అటువంటి పాఠశాలలు ఉన్నాయి. గత మూడు విద్యా సంవత్సరాల్లో వరుసగా సున్నా విద్యార్థుల నమోదును నమోదు చేసిన పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వాటి గుర్తింపును రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (యుపి బోర్డు) ప్రకటించింది.   మరోవైపు, ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతంలోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

కాగా,  ఒకవైపు వేలాది పాఠశాలల్లో విద్యార్థులు లేక ఉపాధ్యాయులు నిరుపయోగంగా ఉండగా.. మరోవైపు దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడితోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులు కేవలం ఒకే ఒక్క టీచర్ ఉన్న పాఠశాలల్లో చదువుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ‘ఒకే టీచర్’ సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలవడం ఆందోళనకరం. 

ఏపీ తరువాత ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిలో ఉన్న ఈ తీవ్ర అసమతుల్యత, దేశంలోని విద్యారంగంలో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కేటాయింపులో ఉన్న లోపాలను స్పష్టంగా ఎత్తి చూపుతోంది. 2022–23లో 118,190గా ఉన్న సింగిల్-టీచర్ పాఠశాలల సంఖ్య 2023–24లో 110,971కి తగ్గింది. దీనితో దాదాపు ఆరు శాతం తగ్గుదల నమోదైంది.