ప్రభుత్వ పథకాలకు ఓట్ల జాబితాను వాడుకున్న కేసీఆర్

ప్రభుత్వ పథకాలకు ఓట్ల జాబితాను వాడుకున్న కేసీఆర్
కేసీఆర్‌ ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజిక్కించుకుని, ప్రభుత్వ పథకాల కోసం దానిని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీ) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది పింఛనుదారులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు ద్వారా ఎంపిక చేసిందని, వారి ఫొటోలు, చిరునామా తదితర వివరాలను దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు.
 
‘‘ఓటరు కార్డు సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానిస్తామని, అందుకు మీ వద్ద ఉన్న ఓటరు గుర్తింపు కార్డుదారుల సమాచారాన్ని ఇవ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల సంఘం సర్వర్ల ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఐటీ శాఖ తన సర్వర్లను ఇందుకు ఉపయోగించింది. దాంతో, సమాచారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ గుప్పిట్లోకి వెళ్లిపోయింది” అని ఆ లేఖలో వెల్లడించారు. 
 
“2015 నుంచి జూలై 2021 వరకు ఎన్నికల సంఘం వద్ద ఉన్న రాష్ట్ర పౌరుల ఓటరు కార్డు సమాచారమంతా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. తర్వాత.. ఆ సమాచారాన్ని వినియోగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం దానిని తనవద్దే ఉంచుకుంది. సరికదా.. సీఈవోకు సమాచారం ఇవ్వకుండా దానిని అక్రమంగా ఉపయోగించుకుంది. అంతేనా, పింఛను పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను రూపొందించడానికి ఆ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది’’ అని ఆ లేఖలో పేర్కొంది.

ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఎన్నికల సంఘం పౌరుల నుంచి సేకరించే సమాచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల వ్యక్తిగత సమాచారం కావడంతో అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, దుర్వినియోగం కాకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు.  ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న పౌరుల సమాచారంతోపాటు తాను సేకరించిన సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భద్రంగా ఉంచాల్సి ఉంది.

కానీ, అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం దీనిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న డేటా మైనింగ్‌, డేటా అనలిటిక్స్‌ కంపెనీ ‘పోసిడెక్స్‌’కు అప్పగించింది.  ఈ కంపెనీ గత ప్రభుత్వంలో ఐటీ శాఖలో కీలకంగా వ్యవహరించిన మీసేవ కమిషనర్‌ గౌరవల్లి వేంకటేశ్వర్‌ కుటుంబ సభ్యులది. ఆయన తల్లి గౌరవల్లి లీలాకుమారి, తమ్ముడు గౌరవల్లి వేణుగోపాల్‌ ఈ కంపెనీ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

కానీ, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈవో రాసిన లేఖలో కూడా ‘పోసిడెక్స్‌’ కంపెనీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. నిజానికి, అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని గత ప్రభుత్వం టి-యాప్‌ పేరుతో సేకరించింది. 

టి-యాప్‌ సేకరించిన సమాచారంతోపాటు ఎన్నికల సంఘం నుంచి సేకరించిన ఓటరు సమాచారాన్ని పింఛనుదారుల వివరాలను రాబట్టడానికి కలిపిందని, ఈ ప్రక్రియంతా ప్రైవేటు కంపెనీ పోసిడెక్స్‌ ఆధ్వర్యంలో జరిగిందని తాజాగా ఎన్నికల సంఘం పేర్కొంది. 2018లో కేసీఆర్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనక  ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కూడా ఉందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో నిజం ఉందని తాజాగా ఈసీ ప్రకటనతో తెలుస్తోంది.