ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జిషీట్‌

ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జిషీట్‌
బిహార్‌ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతా దల్‌ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి సీబీఐ షాక్‌ ఇచ్చింది.  ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 2017లో నమోదైన కేసుపై సీబీఐ తాజాగా డిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.  ఛార్జిషీట్‌లో లాలూ ప్రసాద్‌తో పాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ, వారి కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై అవినీతి, నేరపూరితమైన కుట్ర, మోసం అభియోగాలను మోపింది. 
ఈ క్రమంలోనే రైల్వే మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  లాలూ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. రాంచీ, పూరీల్లోని రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది.

ఈ మేరకు 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు లాలూ, ఆయన భార్య, కుమారుడిపై ఢిల్లీ కోర్టు తాజాగా అభియోగాలు మోపింది. దీంతో ఈ కుంభకోణం కేసులో వీరు విచారణను ఎదుర్కోనున్నారు.

అయితే, “ఇది సాధారణ కోర్టు ప్రక్రియ. ఈరోజు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేయడంతో ఇక్కడికి వచ్చాం. ఈ కేసును న్యాయస్థానంలోనే పోరాడుతాం. కొన్ని రోజుల నుంచి మేము చెబుతూనే ఉన్నాం ఎన్నికల దగ్గరకు రాగానే కోర్టు కేసులు వస్తాయని. మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం. వీటన్నింటిపైనా ఇప్పటికీ పోరాడుతున్నాం. అది కొనసాగిస్తాం” అని తేజస్వి యాదవ్ తెలిపారు.

“బిహార్ ప్రజలు చాలా తెలివైనవారు. వారికి ఏం జరుగుతుందో అంతా తెలుసు. రైల్వే వ్యవస్థకు దాదాపు రూ.90,000 కోట్ల ఆదాయాన్ని లాలూ తీసుకువచ్చారు. ఆయన రైల్వే మంత్రిగా చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హార్వర్డ్​, ఐఐఎమ్​ విద్యార్థులు లాలూ నుంచి నేర్చుకునేందుకు వచ్చేవారు. ఆయనకు మేనేజ్​మెంట్​ గురు అనే పేరు ఉంది” అని గుర్తు చేశారు.

మరోవైపు ఐఆర్​సీటీసీ స్కామ్​లో సీబీఐ ఛార్జ్​షీట్​ దాఖలు చేయడంపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్​ స్పందిస్తూ “అవినీతి చేసినవారిపైనే అభియోగాలు నమోదు చేస్తారు. మొత్తం లాలూ కుటుంబమంతా ఐఆర్​సీటీసీ స్కామ్​లో పాలుపంచుకుంది. లాలూ కుటుంబం అవినీతి, కుంభకోణాలకు గుర్తింపు. ఈ స్కామ్​ల వల్లే బిహార్​ అభివృద్ధికి దూరంగా ఉంది. ఇకపై అవినీతి కుటుంబమైన లాలూను బిహార్​ ప్రజలు అంగీకరించరు” అని స్పష్టం చేశారు.