దగ్గు మందు ‘కోల్డ్​రిఫ్’ సిరప్​ కంపెనీ యజమాని అరెస్ట్

దగ్గు మందు ‘కోల్డ్​రిఫ్’ సిరప్​ కంపెనీ యజమాని అరెస్ట్
* తమిళనాడు ప్రభుత్వ చర్యలపై కేంద్రం అసంతృప్తి

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న తమిళనాడుకు చెందిన శ్రేసన్ ఫార్మా యజమానిని రంగనాథన్​ను మధ్యప్రదేశ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులను పట్టించేందుకు సహాయం చేసిన వారికి రూ.20వేల నగదు అందిస్తామని చెప్పారు. రంగనాథన్‌ను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఏర్పాటు చేశారు. 

చివరికి బుధవారం అర్ధరాత్రి పోలీసులు రంగనాథ్​ను అదుపులోకి తీసుకున్నారు. గురువారమే చెన్నై కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ రిమాండ్‌పై ఛింద్వాడా తీసుకెళ్లనున్నట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో మరణించిన వారిలో ఒక్క ఛింద్వాడాలోనే 17 మంది ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా బుధవారం వెల్లడించారు.  మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి కల్తీ దగ్గుమందు తాగి రాజస్థాన్‌లోనూ కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలస్తోంది.

ఇప్పటికే ఈ కేసులో దగ్గు సిరప్​ను సూచించిన డాక్టర్ ప్రవీణ్​ సోనిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) వ్యతిరేకిస్తోంది. ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా జోక్యం కోరుతోంది. మరోవైపు దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఈ ఔషధం ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్‌రిఫ్‌ దగ్గుమందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని డబ్ల్యూహెచ్‌ఓ అడిగినట్లు సమాచారం. సంబంధిత అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత ఈ ఔషధంపై గ్లోబల్‌ మెడికల్‌ ప్రొడక్ట్స్‌ అలర్ట్‌ జారీ చేయాలా? వద్దా? అనే దానిపై అంచనా వేయనుందని మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా దగ్గు మందు వివాదం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకునే సమయం కాదని, జవాబుదారీతనం అవసరం. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తమిళనాడు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (టీఎన్ ఎఫ్ డి ఏ) చర్యలు తీసుకోవడం లేదు. 

సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సిసిఎస్ సిఓ) సిఫార్సు చేసినప్పటికీ ఎందుకు క్రిమినల్‌ కేసులు పెట్టలేదు? డీసీజీఐ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయలేదు?’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశ్నించినట్లు సమాచారం. చిన్నారుల మరణాల దృష్ట్యా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిన సూచనలతో శ్రేసన్‌ ఫార్మా యూనిట్‌లో తమిళనాడు సర్కారు తనిఖీలు నిర్వహించింది. అక్కడ తయారవుతున్న కోల్డ్రిఫ్‌ సిరప్‌లో డైఇథైలిన్‌ గ్లైకాల్‌ 48.6 శాతం ఉందని తేలింది.

అత్యంత విషపూరితమైన ఈ రసాయనం వల్ల కిడ్నీలు విఫలమవుతాయని అధికారులు పేర్కొన్నారు.  దీంతో ఆ ఔషధాన్ని మార్కెట్‌ నుంచి ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కోల్డ్రిఫ్ సిరప్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రజా హెచ్చరికలు జారీ చేశాయి.