
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రత్యేకం.. 5
కమ్యూనిస్టు పార్టీ పిడివాదం తమ తప్పులను అంగీకరించలేని స్థితికి చేర్చింది. ఎర్రజెండా ముఖ్య తప్పిదాలు అంటూ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ది టెలిగ్రాఫ్ దినపత్రికలో (12–6–2004) ఒక వ్యాసం రాశాడు. అందులో ఆయన కేవలం ఆరు ముఖ్య తప్పిదాల గురించే ప్రస్తావించినప్పటికీ, అటువంటి తప్పులు అనేకం చేసినందునే ఎర్రజెండాకి ఆదరణ తగ్గింది. ఒకప్పుడు కార్మిక రంగాన్ని, విద్యార్థి రాజకీయాలను ఏలిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎక్కడ?
ఆర్ఎస్ఎస్ స్థాపించిన కార్మిక సంఘం (బీఎంఎస్) ఇప్పుడు దేశంలో నెంబర్ వన్. ఒక్కొక్క విశ్వవిద్యాలయ ఎన్నికలను వరుసగా ఏబీవీపీ గెలుస్తున్న వార్తలు వస్తున్నాయి. చారిత్రక అంశాలు, మేథోవాదనల్లో ఒకనాడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వామపక్షవాదులు, నేడు వెనుకంజ వేయక తప్పలేదు. ఆర్ఎస్ఎస్ పునాది మీద పుట్టిన బీజేపీ రాజకీయ విజయం తర్వాత మిగిలిన విజయాలు వస్తున్నాయని కమ్యూనిస్టులు సర్ది చెప్పుకోవటం సరికాదు. అన్ని రంగాలలో ఆర్ఎస్ఎస్ కమ్ముకుని వచ్చినందున బీజేపీకి రాజకీయ విజయం సాధ్యమైంది.
ఒక వార పత్రికలో నేను నిర్వహించే ‘చివరి రోజుల్లో’ శీర్షిక కోసం ప్రముఖుల వారసులను ఇంటర్వ్యూ చేసేవాడిని. ఆ వరసలో నేను కొన్ని సంవత్సరాల క్రితం చండ్ర రాజేశ్వరరావు కొడుకు ఆజాద్ని విజయవాడలోని వారి ఇంట్లో కలిసేవాడిని. తన తల్లిదండ్రులు ఇరువురూ చివరి రోజుల్లో మఖ్దూమ్ భవన్, హైదరాబాద్లో గడిపారని చెపుతూ, ఆ రోజుల్లో ఆయన రాసిన పుస్తకం అంటూ ఒక చిన్న నోట్బుక్ చూపించారు.
అందులోని కొన్ని మాటలు కమ్యూనిస్టులకు చేరాయో లేదో నాకైతే తెలియదు. కానీ అవి వారికి తెలియాలి. అందులో ఒక వాక్యం ‘‘ఈ దేశ ప్రజలు ఎక్కువ మంది విశ్వసించే విషయాలను మనం కాదన్నాం, అందుకే ప్రజలు మనల్ని కాదన్నారు’’ అని ఉంది. ఆ విషయం మీద రాజేశ్వరరావు కొడుకుని వివరణ అడిగినప్పుడు కమ్యూనిస్టులు అనవసరంగా మతం కాదన్నారు, సంస్కృత భాషని వద్దన్నారు, వివేకానందుడిని, చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన చివరి రోజుల్లో తలచుకున్నారని చెప్పారు.
‘వారెక్కడ, మనమెక్కడ’ అనే ప్రశ్నకు చండ్ర రాజేశ్వరరావు ఎంతో ముందుగానే సమాధానం రాసి ఉంచారు. కమ్యూనిస్టుల బలహీనత రోగానికి కారణాలు తెలిశాయి. కాని వాటికి తగిన ఔషధం అందుకునే ధైర్యం ఉందా?! ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రతి దశాబ్దంలో ఒక పెద్ద తప్పు నిర్ణయం చేసుకుంటూ, చీలికలు పేలికలుగా జెండాను చించుకుని, భుజాన మోస్తూ ఇంకా మమ్మల్ని ఆదరించండి అంటే… ఎవరు ఆదరిస్తారు?
(ఆంధ్రజ్యోతి నుండి)
More Stories
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి
శబరిమలలో బంగారం అదృశ్యంతో ఇరకాటంలో సిపిఎం!
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ అదృశ్యం!