భవిష్యత్‌ ఇంధనం హైడ్రోజన్‌

భవిష్యత్‌ ఇంధనం హైడ్రోజన్‌

హెడ్రోజన్‌ భవిష్యత్‌ ఇంధనమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. ఇంధన భద్రత, ఆర్థిక పోటీతత్వం, పర్యావరణ బాధ్యతకు కీలకమైన స్తంభంగా చెబుతూ  2030 నాటికి భారత్‌ ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చెప్పారు. దీనికి బలమైన విధానంతో పాటు రూ.19,700 కోట్ల విలువైన ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం మద్దతు ఇస్తుందని తెలిపారు. 

బయోఫ్యూయల్ బ్లెండింగ్‌ను స్వీకరించడం ద్వారా సాధించిన విజయాలని ప్రస్తావిస్తూ 2020 నాటికి 10 శాతం బయోఫ్యూయల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని, తాము ఐదు నెలల ముందుగానే లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. అప్పుడు 20శాతం బయోఫ్యూయల్‌ బ్లెండింగ్‌ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయన్న ఆయన తొలి లక్ష్యాన్ని ఐదు నెలల ముందుగానే సాధిస్తే రెండో లక్ష్యాన్ని ఆరేళ్ల ముందుగానే సాధించామని చెప్పారు.

పాణి పట్‌లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, విశాఖపట్నంలో టోక్యో ఎనర్జీ బిడ్‌లను ఉటంకిస్తూ భారత్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎలా క్రమంగా తగ్గుతున్నాయో మంత్రి వివరించారు. ఇది పెరుగుతున్న పెట్టుబడిదారుల విశ్వాసమని, సాంకేతిక పరిపక్వతకు సంకేతంగా పేర్కొన్నారు. ఇండియన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, గ్రీన్ అమ్మోనియా టెండర్లను సైతం ప్రస్తావించారు. 
 
సహజ వాయువు కంటే లాజిస్టికల్ ప్రయోజనాలను బట్టి గ్రీన్ అమ్మోనియాను ముఖ్యమైన ఎగుమతి అవకాశంగా మంత్రి అభివర్ణించారు. కేంద్ర మంత్రివర్గం జనవరి 4, 2023న రూ.19,744 కోట్ల వ్యయంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ఆమోదించింది. 2030 నాటికి ఏటా ఐదు ఎంఎంటీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్‌ ఎగుమతిలో భారత్‌ను ప్రపంచం కేంద్రంగా మార్చాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం.