
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 4 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్-కల్వకుర్తి మధ్య 4 లైన్ల హైవే కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని అడిగామని పేర్కొన్నారు.
ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తెలంగాణలోని రహదారుల ప్రోజెక్టుల గురించి చర్చించారు. భూసేకరణ త్వరగా పూర్తి చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా అవుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. కాగా, హైదరాబాద్ మెట్రో విస్తరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సమంజసంగా లేదని కిషన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని కో్రుకునే వ్యక్తుల్లో తాను ముందుంటా అని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్, మెట్రో విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోందని చెబుతూ మెట్రో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. మెట్రోకు అన్ని రకాలుగా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కాళేశ్వరంపై దర్యాప్తుకు సిబిఐ ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం అది పరిశీలనలో కిషన్రెడ్డి ఉందని తెలిపారు.
కాగా, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బిజెపి భయం పట్టుకుందని కేంద్ర మంత్రి విమర్శించారు. . బిఆర్ఎస్ తోనో, కాంగ్రెస్ తోనో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలు నడిపాయి. మేం తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం. కాంగ్రెస్, బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపినే. బిసి రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతిచ్చాం. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
More Stories
సాహితీ ఇన్ ఫ్రా కేసులో జగపతిబాబును విచారించిన ఈడీ
కీలక దశకు ఫార్ములా ఈ-రేసు కేసు
ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణాలో బిజెపిని ఆపలేరు