దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు

దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు
పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లా పోలీస్‌ అధికారుల ఎదుట లొంగిపోయారు. వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ బుధవారం వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 21 మంది మహిళా సభ్యులు ఉన్నారు.  ఆ ప్రాంతంలో నక్సల్స్ ను తుదముట్టించేందుకు ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టి, ఇప్పటికే తొమ్మిది మంది టాప్ కమాండర్లను హతమార్చిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంతకు ముందే నక్సల్స్తో చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. నక్సల్స్ లొంగిపోవాలని లేకపోతే అంతం చేస్తామని గట్టిగా హెచ్చరించారు.  దీంతో పోలీసులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టి భారీగా ఎన్కౌంటర్ లు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అత్యధిక రివార్డు ఉన్న 9 మంది నక్సల్స్ ను హతమార్చారు. టాప్ కమాండర్ సుజాత ఇటీవలే లొంగిపోయారు. ఇప్పుడు బస్తర్ నక్సల్ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు ఆపరేషన్ విజయవంతం అయ్యింది. 

దంతెవాడలో ఏకంగా 71 మంది నక్సలైట్లు ఒకేసారి లొంగిపోయారు. వారందరూ లోన్ వరరతు (ఇంటికి తిరిగి రండి) ప్రచారం ప్రభావంతో లొంగిపోయమని తెలిపారు.  లొంగిపోయిన మావోయిస్టులలో రూ.64 లక్షల రివార్డు కలిగిన 30 మంది మావోయిస్టులు ఉన్నారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.  లొంగిపోయిన మావోయిస్టులు రోడ్లు తవ్వడం, చెట్లు నరికివేయడం, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు పంచడం లాంటి అనేక ఘటనల్లో పాల్గొన్నారు. కొందరైతే పోలీసు స్టేషన్లపై, పోలీసులపై దాడి చేశారు కూడా!

దంతెవాడ జిల్లాలో గత 19 నెలల్లో 461 మందికి పైగా మావోయిస్టుులు లొంగిపోయారు. వారిలో 129 మంది తలలపై రివార్డులు కూడా ఉండడం గమనార్హం. ఇలా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కోసం ప్రభుత్వం రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది. అంతేకాదు వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తుంది. వ్యవసాయ భూములను కూడా కేటాయిస్తుంది.

ముగ్గురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

కాగా, భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జార్ఖండ్‌ రాష్ట్రం గుల్మా జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గుల్మా జిల్లాలోని కేచ్‌కీ అటవీ ప్రాంతంలో జాగ్వార్‌, గుల్మా పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు జార్ఖండ్‌ జన్‌ముక్తి పరిషత్‌ (జేజేఎంపీ)కి చెందిన సభ్యులు లాలు లోహ్రా, సుజిత్‌ ఓరాన్‌ (లోహర్‌గడ జిల్లా), చోటూ ఓరన్‌ (లాతేహర్‌ జిల్లా)లుగా పోలీసులు గుర్తించారు.