ఉద్యోగ భద్రత కోసమే హెచ్-1బి వీసాల పై ట్రంప్ కన్నెర్ర

ఉద్యోగ భద్రత కోసమే హెచ్-1బి వీసాల పై ట్రంప్ కన్నెర్ర
* 40 వేలమంది అమెరికన్ ఉద్యోగులను తొలగించడంతో వివాదం!

హెచ్‌1బీ వీసాల‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా కన్నెర్ర చేయడానికి ఆ దేశంలోని కంపెనీల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది అనేక యూఎస్ కంపెనీలు 40 వేల మందికిపైగా అమెరిక‌న్ టెక్ ఉద్యోగుల‌ను తొల‌గించి, వారి స్థానంలో కొత్త విదేశీ ఉద్యోగుల‌ను, ప్ర‌ధానంగా హెచ్‌1బీ వీసా హోల్డ‌ర్స్‌ను నియ‌మించార‌ని వైట్‌హౌస్ పేర్కొంది. 

 
ఈ చ‌ర్య అమెరిక‌న్ యువ‌త సైన్స్‌, టెక్‌, ఇంజినీరింగ్‌, స్టెమ్ కెరీర్‌ల‌పై ఆస‌క్తిని త‌గ్గిస్తోంద‌ని, ఇది యూఎస్ జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పును క‌లిగిస్తోంద‌ని వైట్‌హౌస్ పేర్కొంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఒక కంపెనీకి 5,189 హెచ్-1బి వీసాలకు ఆమోదం ల‌భించింది. కానీ, అది ఈ సంవత్సరం 16 వేల మంది అమెరిక‌న్ ఉద్యోగుల‌ను తొల‌గించింది.

మరొక కంపెనీకి 1,698 హెచ్-1బి వీసాలకు ఆమోదం ల‌భించ‌గా జులైలో  ఒరెగాన్‌లో 2,400 మంది కార్మికులను తొలగించింది. మూడవ కంపెనీ 2022 నుంచి 27వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. అదే సమయంలో స‌ద‌రు కంపెనీ 25,075 హెచ్-1బి వీసాలను పొందిన‌ట్లుగా పేర్కొంది.  మరో కంపెనీ ఫిబ్రవరి 2025లో 1,000 మంది అమెరికన్ల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌గా 1,137 హెచ్-1బి వీసాలకు ఆమోదం పొందింది. 

బహిర్గతం చేయని ఒప్పందాల కింద అమెరికన్ ఉద్యోగుల‌ను కొన్ని సార్లు త‌మ విదేశీ ప్ర‌త్యామ్నాయాల‌కు శిక్ష‌ణ ఇవ్వాల్సి వ‌చ్చేద‌ని వైట్‌హౌస్ వెల్ల‌డించింది. ఈ వివాదం మధ్య, ప్రతి కొత్త  హెచ్-1బి వీసాకు కంపెనీలు ఇప్పుడు 100,000 డాల‌ర్లు (సుమారు రూ.8.3 మిలియన్లు) ఒకేసారి రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

హెచ్-1బి ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అమెరికన్ ఉద్యోగులు తమ వేతనాలను కోల్పోకుండా నిరోధించడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. అయితే, ఈ రుసుము కొత్త  హెచ్-1బి వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది గతంలో జారీ చేసిన వీసాలు, వాటి పునరుద్ధరణలను ప్రభావితం చేయ‌బోదు. 

ఈ నియమం సెప్టెంబర్ 21 నుంచి అమ‌లులోకి వచ్చింది. 2025 హెచ్-1బి లాటరీని గెలుచుకున్న అభ్యర్థుల నుంచి కూడా కొత్త ఫీజుల‌ను వ‌సూలు చేయ‌రు. సెప్టెంబర్ 21 కి ముందు దాఖలు చేసిన వీసా దరఖాస్తులకు కొత్త ఫీజుల‌ను వసూలు చేయబ‌డ‌వ‌ని యూఎస్‌సీఐసీఎస్ స్ప‌ష్టం చేసింది. ట్రంప్ నిర్ణయం భారతదేశ ఐటీ నిపుణులను నేరుగా ప్రభావితం చేయ‌నున్న‌ది. ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో హెచ్-1బి వీసాల‌ను కంపెనీ భార‌తీయుల‌కు ఇస్తున్నాయి.