రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!

రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్  అంజనీ సిన్హా కేసు!

వైసీపీ హయాంలో అడ్డగోలు సినిమాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆర్జీవీపై కేసు పెట్టారు. `దహనం’ అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్‌ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘దహనం’ వెబ్‌సిరిస్‌కు నిర్మాతగా రామ్‌గోపాల్‌వర్మ వ్యవహరించారు. ఆమె ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్‌చేశారు.

కథ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. అప్పట్లో అంజనా సిన్హా అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజనా సిన్హా ఇప్పుడు ఫిర్యాదు చేశారు.  2022 ఏప్రిల్‌ 14న ఆ సినిమా విడుదలైంది. ఫ్యూడలిస్టులు, మావోయిస్టుల మధ్య జరిగే పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఆర్జీవీ నిర్మాణ సారధ్యంలో డైరెక్టర్‌ అగస్త్య మంజు దీనిని రూపొందించారు. 

ఓ కమ్యూనిస్టు నేతను ఏ విధంగా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ఆయన కొడుకు ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఇందులో చూపించారు. ఈ సినిమాను రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు ఆర్జీవీ వెల్లడించారు.  దహనం వెబ్ సీరిస్ మొదట ఎంఎక్స్ ప్లేయర్ ‌లో విడుదలైంది. అయితే తర్వాత తొలగించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్, ఒక కమ్యూనిస్టు కార్మికుడి హత్య అనంతరం ప్రతీకార కథ చుట్టూ తిరుగుతుంది. 

1990 బ్యాచ్‌కు చెందిన అంజన తెలుగు రాష్ట్రాల్లో డీజీపి హోదా వరకూ పనిచేసేరు. రాయలసీమలో ఎస్పీగా, డిఐజిగా పనిచేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ డైరక్టర్ గా కూడా పనిచేశారు. అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్‌సిరీస్‌లో ఉపయోగించారు. 

“ఓ స్నేహితుడి ద్వారా నాకు ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది నేను నిర్మాత, దర్శకుడిని ఎప్పుడూ కలవలేదు. మాట్లాడలేదు. ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు. నా పేరుతో, నా ప్రొఫెషనల్ ఐడెంటిటీతో ఈ సిరీస్‌ను నరేట్ చేసినట్లు చూపించడం ద్వారా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు.ఈ సిరిస్‌ మొత్తం హింసాత్మక దృశ్యాలు, సెక్సువల్ కంటెంట్ ఉంది. ” అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతరకరమైన వెబ్‌సిరీస్‌లో తన ఐడెంటిటీని వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సిరిస్‌ మొత్తం హింసాత్మక దృశ్యాలు, సెక్సువల్ కంటెంట్ ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి తన ప్రతిష్ట, గౌరవం, ప్రొఫెషనల్ స్టాండింగ్‌కు తీవ్ర నష్టం కలిగించాయని, తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని, మానసికంగానూ కలత చెందినట్లు ఫిర్యాదులో అంజనీ సిన్హా పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు సెప్టెంబర్ 10న నిర్మాత, దర్శకుడిపై  ఐపీసీ సెక్షన్లు 509, 468, 469, 500, 120(బి) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలో ఆయనపై పలు కేసులు ఉన్నాయి.