ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ

ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రియల్ ఎస్టేట్ రంగంలో భారీ అడుగు వేసింది. ఇప్పటికే ముంబై మింట్ రోడ్‌లోని ప్రధాన కార్యాలయం, అనేక ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ, ఇప్పుడు కొత్త ప్రదేశాన్ని సొంతం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆర్బీఐ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ నుంచి 4.61 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ కోసం ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. 

ఈ మొత్తం ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన అతిపెద్ద భూమి కొనుగోలు విలువగా భావిస్తున్నారు. వ్యాపార వర్గాల ప్రకారం, ఇప్పటివరకు ముంబైలో ఇంత భారీ రేటుతో భూమి కొనుగోలు జరగడం ఇదే మొదటిసారి. ముంబైలోని ప్రీమియం ప్రాంతంలో ఆర్బీఐ చేసిన ఈ భారీ భూమి కొనుగోలు ఈ ఏడాది దేశంలోనే అతిపెద్ద భూ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ భూమి ముంబైలోని మంత్రాలయ, బాంబే హైకోర్టు, ప్రముఖ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉంది. ఇది నారిమన్ పాయింట్ ప్రాంతానికి దగ్గరగా ఉండటం విశేషం. నారిమన్ పాయింట్ దేశంలోనే అత్యంత ఖరీదైన వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందింది. అక్కడ భూమిని సొంతం చేసుకోవడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు చెబుతారు.  భారీ మొత్తంలో జరిగిన ఈ డీల్ పెట్టుబడిదారులు, డెవలపర్లు, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిపుణుల అంచనాల ప్రకారం, ఈ కొనుగోలు ముంబై రియల్ ఎస్టేట్ విలువలను మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఇలాంటి ప్రీమియం ప్రదేశాల్లో ఆస్తుల ధరలు మరింత ఎగసిపడతాయని భావిస్తున్నారు. ఆర్బీఐ ఇప్పటికే అనేక ప్రధాన కేంద్రాల్లో ఆస్తులను కలిగి ఉన్నప్పటికీ, ముంబైలో మరో కీలక స్థలం సొంతం చేసుకోవడం వ్యూహాత్మకంగా చూస్తున్నారు. రాబోయే కాలంలో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంలో, కొత్త అవసరాలను తీర్చడంలో ఈ ప్రాపర్టీ ఉపయుక్తంగా మారనుంది. 

అదేవిధంగా, రాబోయే కాలంలో ఇతర ఆర్థిక సంస్థలకు కూడా ఇది ఒక ప్రేరణగా మారవచ్చని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది కేవలం రియల్ ఎస్టేట్ రంగానికే కాకుండా, భారత ఆర్థిక రంగానికి కూడా ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు.