
* ప్రజల భద్రత, ప్రయోజనాలను కాపాడటతాం… సైన్యం
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ రగులుతున్నది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించినప్పటికీ హింసాత్మక నిరసనలు రెండో రోజు కూడా కొనసాగాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన సహాయకుడు ప్రకాష్ సిల్వాల్ ధ్రువీకరించారు. దేశాధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు.
సైన్యం చేతుల్లోకి పగ్గాలు వెళ్లేలా కనిపిస్తోంది. మంత్రులు, ఇతర నేతలను ఆర్మీ బ్యారక్స్లోకి తరలిస్తున్నట్లు వార్తలందాయి. మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వారిని తరలిస్తున్నట్లు ఖాట్మండు పోస్ట్ తెలిపింది. ఆందోళనలు, నిరసనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారు.
అరుదైన రీతిలో నేపాల్ ఆర్మీ, ఇతర భద్రతా సంస్థల చీఫ్లు సంయుక్తంగా ప్రజలను సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. ఈ ప్రకటనపై ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డల్, చీఫ్ సెక్రటరీ ఏక్నారాయణ్, హోం కార్యదర్శి, సాయుధ పోలీసు బలగాల చీఫ్ ప్రభృతులు సంతకాలు చేశారు. “జెన్ జీ ఉద్యమం తాజా పరిణామాలను మేము విశ్లేషిస్తున్నాం. నేపాల్ ప్రజల భద్రత, ప్రయోజనాలను కాపాడటంలో నేపాల్ సైన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాం” అని స్పష్టం చేశారు.
“దేశంలోని యువతతో పాటు ప్రతి పౌరుడు శాంతంగా ఉండాలి. సామాజిక ఐక్యత, జాతీయ ఐక్యతను కాపాడాలి. లేకపోతే ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. అలాగే, ఈ క్లిష్ట సమయంలో దేశంలోని చారిత్రక, సాంస్కృతిక, పురావస్తు, జాతీయ ఆస్తులను కాపాడటం ప్రతి నేపాలీయుడి కర్తవ్యం” అని సైన్యం గుర్తు చేసింది. దేశంలో తిరిగి పరిస్థితులను చక్కబెట్టాలంటే, శాంతి భద్రతల వ్యవస్థను పునరుద్ధరించాలంటే చర్చలు ఒక్కటే పరిష్కార మార్గమని అధ్యక్షుడు రామ్చంద్ర పౌడల్ పేర్కొన్నారు.
ఆందోళనకారులను చర్చలకు రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో వుందని, దీన్నుండి బయటపడేందుకు, శాంతియుత పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు చర్చలకు సహకరించి ముందుకు రావాల్సిందిగా ఆయన కోరారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని సామాజిక మాధ్యమాల్లో నిరసనకారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే నేతల వ్యక్తిగత నివాసాలతో పాటు పార్లమెంట్, సుప్రీంకోర్టుకు నిప్పంటించారు. వీటిని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి.
ఆ ఆస్తులను కాపాడుకునేందుకు వారు రంగంలోకి దిగాయి. హింసను కట్టడిచేసే చర్యలపై దృష్టి సారించాయి. ఈ నిరసనల్లో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇక, దిల్లీ-కాఠ్మాండూ విమానాలను ఎయిర్ఇండియా రద్దు చేసింది. నేపాల్ మాజీ ప్రధాని ఝలానాథ్ ఖనల్ సతీమణి రబీ లక్ష్మీ చిత్రకార్ నివసిస్తున్న ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను కీర్తిపూర్ దవాఖానకు తరలించగా ఆమె మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
నేపాల్ డిప్యూటీ ప్రధాని, ఆర్థికమంత్రి విష్ణుప్రసాద్ పౌడల్పై నిరసనకారులు చేయిచేసుకున్నారు. ఆయన బట్టలు కూడా ఊడదీసి కొంతమంది వ్యక్తులు ఆయన కాళ్లూ, చేతులు పట్టుకుని ఈడ్చుకుని వెళుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. మాజీ మంత్రి ఏక్నాథ్ థకాల్ను కూడా అలాగే బట్టలూడదీసి వీధుల్లో ఈడ్చుకువెళ్లారు.
పాలక సంకీర్ణంలో భాగస్వామి అయిన నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జూ రాణా దేబాలపై వారి నివాసంలోనే దాడి జరిగింది. వారిని ఆందోళనకారులు తొలుత తమ కస్టడీలో అట్టిపెట్టుకున్నారు. ఇంటిని ధ్వంసం చేశారు. తర్వాత మండుతున్న ఇంటి నుండి మంత్రిని తరలించారు.
ఖాట్మండు, దేశంలోని ఇతర ప్రాంతాలలో జనరల్ జెడ్ నేతృత్వంలోని నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రధాన మంత్రి కె పి శర్మ ఓలి రాజీనామా చేయడంతో మంగళవారం నేపాల్ రాజకీయ గందరగోళంలో పడింది. పార్లమెంట్, ప్రధాన మంత్రి కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఓలి, అనేక మంది మాజీ ప్రధానుల ప్రైవేట్ నివాసాలకు నిప్పు పెట్టారు.
సోషల్ మీడియా నిషేధం, విస్తృతమైన అవినీతి ఆరోపణలపై చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి, డజన్ల కొద్దీ గాయపడ్డాయి. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. గత సంవత్సరం జూలైలో తన నాల్గవ పదవీకాలం ప్రారంభించిన ఓలి, తన రాజీనామా లేఖలో “సమస్యకు పరిష్కారాన్ని సులభతరం చేయడానికి, రాజ్యాంగం ప్రకారం రాజకీయంగా పరిష్కరించడానికి సహాయం చేయడానికి” రాజీనామా చేశానని చెప్పారు.
పదివేల మంది నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై దాడి చేసి నిప్పంటించి రాజకీయ నాయకులపై దాడి చేసిన తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించే ప్రయత్నంలో సాయుధ సైనికులు బుధవారం నేపాల్ రాజధాని వీధులను కాపలాగా ఉంచారు.ప్రజలను ఇళ్లలోనే ఉండమని ఆదేశించారు. ఖాట్మండులోని ప్రధాన ప్రాంతాలను కాపలాగా ఉంచిన ఆయుధాలతో ఉన్న సైనికులు మునుపటి రోజుల్లో హింస, గందరగోళంతో నిండిన నగరానికి తిరిగి రావడానికి కొంత నియంత్రణను ఇస్తున్నట్లు కనిపించారు.
More Stories
`బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఫ్రాన్స్ లో పెద్దఎత్తున నిరసనలు
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం