పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే

పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌ మజ్రా అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యారు. అయితే, ఆయన అనూహ్యంగా పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఎమ్మెల్యే. పటియాలలోని సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న హర్మీత్, తన సహచరులతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పుల్లో ఒక పోలీస్ అధికారిని గాయపరిచి, వాహనంతో ఢీకొని తప్పించుకున్నట్లు సమాచారం. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రెండు వాహనాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి ఓ వాహనాన్ని పట్టుకున్నారు. అయితే, అందులో ఎమ్మెల్యే లేరు. వేరే వాహనంలో పారిపోయారు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

స‌నౌర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ అరెస్టుకు ముందు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఓ పాత ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌పై రేప్ కేసు న‌మోదు చేసిన‌ట్లు ఆ వీడియోలో ఆయ‌న చెప్పాడు. పంజాబ్ పోలీసులు త‌న‌పై ఐపీసీ 376 కింద కేసు బుక్ చేశార‌ని పేర్కొన్నారు. త‌న మాజీ భార్య ఆ కేసులో ఉన్న‌ట్లు తెలిపారు.  ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ బృందం త‌న‌పై పెత్త‌నం చెలాయిస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. త‌న గొంతు నొక్కే ప్రయ‌త్నం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

కాగా, ఎమ్మెల్యేపై అత్యాచార కేసు జిరక్‌పూర్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు నమోదైంది. హర్మీత్ విడాకులు తీసుకున్నట్లు తనకు తప్పుడు సమాచారం ఇచ్చి, 2021లో పెళ్లి చేసుకున్నాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.  అంతేకాదు, తన మీద లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడి, అసభ్యకరమైన సందేశాలను పంపినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను హర్మీత్ ఖండించారు. ఇవి రాజకీయ కుట్రలో భాగమని, ఆప్ ఢిల్లీ నాయకత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఫేస్‌బుక్ లైవ్‌లో ఆరోపించాడు.

ఇదిలా ఉంటే, ఈ ఘటనలకు ముందు హర్మీత్ పంజాబ్‌లో వరదల నిర్వహణపై తన పార్టీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ నాయకత్వాన్ని విమర్శించాడు. ఈ క్రమంలో ఆప్ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ హర్మీత్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించి, సనౌర్ నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్ కు అధికారులను బదిలీ చేసింది. దీంతో ఈ కేసు రాజకీయ వివాదంగా మారింది,