అసెంబ్లీలో తప్పుడు హామీలపై రేవంత్ ను నిలదీయాలి!

అసెంబ్లీలో తప్పుడు హామీలపై రేవంత్ ను నిలదీయాలి!
 
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్న అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని బిజెపి శాసనసభాపక్ష సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు పాల్గొన్నారు.   అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే విషయాలపై చర్చించారు.
బిజెపి శాసనసభ పక్ష నాయకులు  ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసన మండలి పక్ష నాయకులు  ఎవిఎన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో 420 తప్పుడు హామీలతో పాటు దాదాపు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 
 
ప్రజాసమస్యల నుండి దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చి నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు – ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే అని స్పష్టం చేశారు.

లక్ష కోట్ల అవినీతి కక్కిస్తా, ఆ డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, దాదాపు 2 సంవత్సరాల పాలన గడిచినా ఇప్పటి వరకు అవినీతి పరులపై కేసులు నమోదు చేయలేదని, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని ఆయన గుర్తు చేశారు.  “100 రోజుల్లో హామీలను నెరవేర్చుతాం, 100 రోజుల్లో అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం, 100 రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి దాదాపు 20 నెలలు గడిచినా ఇప్పటివరకు అవినీతి సొమ్ము బయట పెట్టలేదు” అంటూ గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి నివేదిక వచ్చిందని చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి  విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలను, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తాం అని స్పష్టం చేశారు.

మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించి పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. కేవలం నిర్మల్ నియోజకవర్గంలోనే దాదాపు 10 వేల ఎకరాల పంట నష్టం సంభవించిందని చెప్పారు.

లోతట్టు ప్రాంతాల్లో అనేక ఇండ్లు మునిగిపోయాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిందని, కాన. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో గాలితిరుగుడు తిరగడం కాదు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలని, మంత్రులను క్షేత్రస్థాయికి పంపించి నష్టాన్ని అంచనా వేయాలని, తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.  బిజెపి ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కూడిన బృందం ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు.