దేశంలో అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి

దేశంలో అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి
భారతదేశం మరికొద్ది కాలంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేగవంతమైన ప్రగతి వెనుక ప్రధాన కారణం, దేశంలోని కొన్ని జిల్లాలు ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా మారడమేనని తాజా ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. ఈ నివేదికలో అత్యధిక తలసరి జిడిపి కలిగిన టాప్ 10 జిల్లాలను ప్రకటించారు.
 
అయితే వీటిల్లో ముంబై, గుర్గావ్, బెంగళూరు వంటివి కాకుండా  తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా దేశంలో అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. ఇక్కడ తలసరి జిడిపి రూ 11.46 లక్షలు. హైదరాబాద్ ఐటీ కారిడార్, ఔషధ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి రంగారెడ్డిని ఆర్థిక శక్తిగా మలిచాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే జిల్లాగా ఇది అవతరించింది.హర్యానాలోని గురుగ్రామ్ రూ. 9.05 లక్షల తలసరి జిడిపితో రెండో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఈ జిల్లా ఐటీ సేవలు, బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని బెంగళూరు రూ. 8.93 లక్షల తలసరి జిడిపితో మూడో స్థానంలో నిలిచింది. “భారత సిలికాన్ వ్యాలీ”గా పేరుగాంచిన ఈ నగరం ఐటీ ఎగుమతులు, టెక్ స్టార్టప్‌లు, ప్రతిభావంతులైన శ్రామిక శక్తితో అభివృద్ధి చెందుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) రూ. 8.48 లక్షల తలసరి జిడిపితో నాలుగో స్థానంలో ఉంది. ఇది తయారీ, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా రూ. 8.10 లక్షల తలసరి జిడిపితో ఐదో స్థానాన్ని పొందింది. ఫార్మాస్యూటికల్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఈ జిల్లాకు ఆర్థిక బలం చేకూరుస్తున్నాయి.

ఉత్తర , దక్షిణ గోవా జిల్లాలు రూ. 7.63 లక్షల తలసరి జిడిపితో కలిసి ఆరవ స్థానంలో నిలిచాయి. పర్యాటకం, హోటల్ రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు కీలకం.గ్యాంగ్‌టాక్, నామ్చి, మంగన్, గ్యాల్షింగ్ జిల్లాలు రూ. 7.46 లక్షల తలసరి జిడిపితో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాయి. పర్యావరణ సంపద, స్థిరమైన పర్యాటకం ఈ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా రూ. 6.69 లక్షల తలసరి జిడిపితో ఎనిమిదో స్థానంలో ఉంది. విద్య, సేవల రంగం, పోర్ట్ ఆధారిత వాణిజ్యం దీని ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణాలు. భారత ఆర్థిక రాజధాని ముంబై రూ. 6.57 లక్షల తలసరి జిడిపితో తొమ్మిదో స్థానంలో ఉంది. స్టాక్ మార్కెట్, కార్పొరేట్ ఆఫీసులు, బ్యాంకింగ్ సేవలు దీని ప్రధాన బలాలు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా రూ. 6.54 లక్షల తలసరి జిడిపితో పదో స్థానాన్నిదక్కించుకుంది. వస్త్రాలు, రసాయనాలు, ఆధునిక పరిశ్రమలు దీని అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.