ఆర్చరీ యూత్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయికి స్వర్ణం

ఆర్చరీ యూత్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయికి స్వర్ణం
అంతర్జాతీయ క్రీడా యవనికపై తెలంగాణ కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. కెనడా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఆర్చరీ యూత్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత స్వర్ణంతో కొత్త చరిత్రను సృష్టించింది.  జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా పరిగణించే ఈ పోటీల్లో చికిత మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గింది. 
భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌లో చికిత హోరాహోరీగా సాగిన ఫైనల్లో 20 ఏళ్ల చికిత 142-133తో స్పెయిన్‌ ఆర్చర్‌ పౌలా డియాజ్‌ మోరిల్లా్‌సపై విజయం సాధించింది. అంతకుముందు సెమీ్‌సలో చికిత 142-136తో పార్క్‌ యెరిన్‌ (రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా)పై, క్వార్టర్స్‌లో ఆసియా చాంపియన్‌, భారత్‌కే చెందిన పర్నీత్‌ కౌర్‌పై 146-143తో గెలిచింది.
ఇక, పురుషుల అండర్‌-18 టీమ్‌ ఈవెంట్‌లో తెలుగు సంతతికి చెందిన అమెరికా ఆర్చర్‌ నాళం సూరజ్‌ కార్తికేయ బృందానికి రజత పతకం లభించింది. సూరజ్‌ తల్లిదండ్రుల స్వస్థలం రాజమండ్రి. సూరజ్‌ కూడా గతంలో రాజమండ్రిలో శిక్షణ తీసుకొన్నాడు.  మరోవంక, పుణేకు చెందిన 16 ఏళ్ల శార్వరి షెండే, అండర్-18 మహిళల వ్యక్తిగత రికర్వ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ యెవాన్‌ను 6-5 తేడాతో ఓడించింది. గాథా ఖడకే, అగ్‌స్టే సింగ్ రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 
దీంతో భారతదేశం నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో గెలుచుకుంది.  యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లోని ఈ విభాగంలో భారత్‌ స్వర్ణం గెలవడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఆరంభ రౌండ్‌ నుంచి అద్భుత ప్రదర్శనతో రాణించిన ఈ పెద్దపల్లి అమ్మాయి  క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన పరిణీత్‌ కౌర్‌ను ఓడించగా సెమీస్‌లో స్పెయిన్‌ షూటర్‌ పౌలా డియాజ్‌ మొరిల్లాస్‌ను మట్టికరిపించింది. 
 
ఇక ఫైనల్‌లో చెక్కుచెదరని గురితో పతకం సాధించి కొత్త రికార్డును లిఖించింది. గత మేలో చైనా వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2లో జ్యోతి సురేఖ, మధురతో కలిసి టీం సిల్వర్‌ మెడల్‌ను సాధించిన చికిత తాజాగా వరల్డ్‌ ఆర్చరీ యూత్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకోవడంతో ఆమె దాదాపుగా 20వ ర్యాంకుకు ఎగబాకనుంది. చికిత గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
చికిత తండ్రి శ్రీనివాసరావు ఓ సామాన్య రైతు. ఆమెకు బాల్యం నుంచి ఆర్చరీపై మక్కువతో విలు క్రీడనే కెరీర్‌గా ఎంచుకుంది. గత రెండు జాతీయ క్రీడల్లో రజత, కాంస్య పతకాలు సాధించింది. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్‌లో నాలుగో స్థానంలో నిలిచి, త్రుటిలో పతకం కోల్పోయింది. అమెరికాలో జరిగిన గత వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించినా వీసా సమస్యతో బరిలోకి దిగలేకపోయింది. 
 
ఈసారి వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌నకు వీసా లభించినా కెనడా ఎయిర్‌లైన్స్‌ సమ్మె కారణంగా ఆమె ప్రయాణ షెడ్యూల్‌ మొత్తం తలకిందులైంది. ఆఖరి నిమిషం వరకు కెనడా వెళ్లేందుకు మార్గం సుగమం కాలేదు. భారత్‌ నుంచి మొత్తం 36 మందితో కూడిన బృందం అక్కడికి వెళ్లాల్సి ఉండగా సమ్మె కారణంగా విడతల వారీగా వెళ్లాల్సి వచ్చింది. చివరి విడతకు వచ్చేసరికి ప్రయాణ అవకాలన్నీ దాదాపుగా మూసుకుపోగా ‘సాయ్‌’ అధికారుల గట్టి ప్రయత్నంతో ఆమెతో పాటు మరో ఐదుగురు ఆర్చర్లు పోటీలకు కొన్ని గంటల ముందు కెనడాలో అడుగు పెట్టగలిగారు. 
 
“సరైన విశ్రాంతి లేకుండానే తొలి రెండు రౌండ్లలో పాల్గొన్నా. ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్స్‌లో ఆసియా చాంపియన్‌ పర్నీత్‌ కౌర్‌పై గెలిచాక పసిడి పతకం గెలుస్తానన్న నమ్మకం కలిగింది. అదే ఆత్మవిశ్వాసంతో సెమీస్‌, ఫైనల్‌లో పోటీపడి ఫలితం రాబట్టా. సీనియర్‌ క్రీడాకారుడు అభిషేక్‌ వర్మ సలహాలు సూచనలతో ఈ విజయం సాధించగలిగా” అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు.