భారత్ సరుకులు నచ్చకపోతే కొనొద్దు

భారత్ సరుకులు నచ్చకపోతే కొనొద్దు

* అన్నీ ఆలోచించే రష్యా చమురు కొనుగోలు

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ధోరణిపై, సుంకాల మోతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “భారత్‌తో ఏదైనా విషయంలో సమస్య ఉంటే ఏ దేశం అయినా భారతదేశ ఉత్పత్తులు లేదా సరుకులు తెప్పించుకోకుండా ఉంటే మంచిది. వారి మార్గాలు వారికి ఉన్నట్లు మాకూ మా దారులు ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు. 

శనివారం ఆయన ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ భారత్ చెప్పిన మాట వినడం లేదని, రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోళ్లకు దిగుతోందని ట్రంప్ ఆగ్రహిస్తున్నారు. ఇందుకు ప్రతిగా భారత్‌పై అదనపు సుంకాలు, పెనాల్టీలకు దిగుతున్నారు. ఈ విషయంపై జై శంకర్ స్పందించారు. 

ఏ దేశంలో అయినా స్వీయ ప్రయోజనాల కోణంలోనే నిర్ణయాలు ఉంటాయి. అంతేకానీ ఇతర దేశాల ఆలోచనలకు అనుగుణంగా స్పందించడం కుదరదు. దీనిని అన్ని దేశాలూ అర్థం చేసుకోవల్సి ఉంటుంది. మాకంటూ పలు నిర్థిష్ట ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడి రైతులు, చిన్న వ్యాపారుల విషయాలను నిశితంగా పరిశీలించుకుని తీరాలి అని ఆయన స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే ఏ నిర్ణయం అయినా తీసుకోవల్సి ఉంటుందని, దీనిని అంతా గ్రహించాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికాకు ఆయన చురకలు పెట్టారు. అమెరికాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందం అయినా దేశ ప్రయోజనాల పరిధిలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. 

“భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. మాకంటూ కొన్ని ప్రయోజనాలున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. రైతులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు. భారత్‌తో సమస్య ఉంటే తమ చమురును, శుద్ధిచేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దు. వాటిని కొనుగోలు చేయాలని మేం ఎవర్నీ బలవంతం చేయడం లేదు” అని జైశంకర్‌ తెలిపారు.

సుంకాల విషయంలో ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలకు దిగుతున్నారని జైశంకర్ విమర్శించారు.  చైనా, ఇయూలపై వేరే విధంగా వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ రెండూ రష్యా క్రూడాయిల్‌ను, సిఎన్‌జిని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి? కదా అని ప్రశ్నించారు.  2022లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ విషయం అమెరికాకు ఇతర దేశాలకూ తెలుసని చెప్పారు.  దేశ ప్రయోజనాలు, ప్రపంచ దేశాల పరిస్థితికి అనుగుణంగానే రష్యా చమురు తీసుకుంటూ వస్తున్నామని, ఇందులో వేరే ఉద్దేశాలు వెతుక్కుంటే అది తప్పిదమే అవుతుందని జైశంకర్ చెప్పారు. 

అలాగే దేశ ప్రయోజనాలతో పాటు ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి భారత్​ చమురును కొనుగోలు చేస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు. రష్యా చమురు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ధరలు స్థిరీకరణ ఉంటుందని ప్రపంచ ప్రముఖ దేశాలు భావించాయని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు దిగుమతులను పరస్పర వాణిజ్య ఒప్పందం క్రమంలోనే అనుమతించామని వివరించారు. 

రష్యా నుంచి చమురు విషయానికి, ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని, వేర్వేరు విషయాలు అని, పైగా ప్రధాని మోదీ ఘర్షణ పరస్పర చర్చలతో ముగియాలని పదేపదే అందులోనూ తొలుత ఉద్బోధించారని గుర్తు చేశారు. ఉద్రిక్తతలు చల్లారనేదే భారతదేశ ఆకాంక్ష అని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ విధానంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా వెల్లడించిన ఏ అధ్యక్షుడినీ గతంలో మనం చూడలేదు. ఒక్క భారత్​ గురించి కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలతో ఆయన డీల్​ చేస్తున్న తీరుకు, అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులకు చాలా తేడా ఉంది. ఇక వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వాటికి కూడా సుంకాలు విధించడం కొత్తగా అనిపిస్తోంది” అని జైశంకర్ తెలిపారు.