
వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఢిల్లీలో యమునా నదిలో నీరు డేంజర్ మార్క్ దాటి ప్రవాహిస్తోంది. ముంబైలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షాల కారణంగా అంధేరి, ఘట్కోపర్, నవీ ముంబై, దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో జలమయంతో ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక రైళ్లు నడుస్తున్నప్పటికీ ట్రాక్ వరదల కారణంగా స్వల్ప జాప్యాలు ఎదుర్కొంటున్నాయి.
రాబోయే కొన్ని గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో పట్టణ వరదల ప్రమాదం పెరుగుతుంది. మెరైన్ డ్రైవ్, జుహు, వర్లి సీ ఫేస్ వంటి ప్రదేశాలలో అధిక ఆటుపోట్ల సమయంలో తీరప్రాంతం దగ్గర అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. క్యాచ్మెంట్ జోన్లలో అసమాన వర్షాలు ఉన్నప్పటికీ, ముంబైలోని ఏడు సరస్సులు 90% నిండి ఉన్నాయి, ఇది నగర నీటి సరఫరాను సురక్షితం చేస్తుంది.
పూణేలో కూడా భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ విధించబడింది. ముంబై నగరంలో వర్షాలు కురుస్తున్నందున అక్కడ కొనసాగుతున్న పరిస్థితిని అంచనా వేయడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. మరోవంక, దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ 206 మీటర్ల మార్క్ను యమునా నది మంగళవారం తాకనున్నట్లు కేంద్ర జల సంఘం పేర్కొన్నది. 205.33 మీటర్లను డేంజర్ మార్క్గా గుర్తిస్తున్నారు.
ఒకవేళ నది 206 మీటర్లను తాకితే, అప్పుడు ఢిల్లీలో తరలింపు ప్రక్రియ చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది ప్రవాహం 204.8 మీటర్లుగా ఉన్నది. ఆదివారం సాయంత్రం204.6 మీటర్లుగా ఉన్నది. అయితే వార్నింగ్ మార్క్ను మాత్రం 204.5 మీటర్లుగా ఫిక్స్ చేశారు. గత రెండు రోజుల నుంచి వరుసగా వార్నింగ్ మార్క్పైనే నది ప్రవాహిస్తున్నట్లు గుర్తించారు. అన్ని ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
వరద ఉదృతిని సమీక్షించేందుకు ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ను కీలకమైన పాయింట్గా భావిస్తారు. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజ్ల నుంచి వస్తున్న నీటితో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం పెరిగింది. హత్నీకుండ్ నుంచి 58,282 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. వజీరాబాద్ నుంచి గంటకు 36,170 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు ఢిల్లీని చేరేందుకు కనీసం 50 గంటలు పట్టే అవకాశం ఉన్నది.
ఈ సీజన్లో తొలిసారి హత్నీకుండ్ బ్యారేజ్లో ఉన్న అన్ని 18 గేట్లను ఎత్తివేశారు. హర్యానా, పంజాబ్కు ఐఎండీ తాజా వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. కర్నల్, ఇంద్రి, తనేసర్, అంబాలా, పాటియాలా, మొహాలీ, లుథియానాకు భారీ వర్ష సూచన ఉన్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జమ్మూ ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థలను సోమవారం మూసివేయాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు తెలిపారు.
గత నాలుగు రోజుల్లో కిష్త్వార్ జిల్లాలోని చిసోటి గ్రామం, కథువా జిల్లాలోని జోధ్ ఘాటి, జాంగ్లోట్ ప్రాంతాలలో సంభవించిన మూడు మేఘాల విస్ఫోటనాలలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 122 మంది గాయపడ్డారు. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈరోజు తెల్లవారుజాము నుండి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు జాతీయ వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడంతో పాటు రాత్రిపూట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ముంబై అధికారులు హెచ్చరించారు. వర్షాల కారణంగా కర్ణాటకాలోని బెళగావి జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్వాడీలకు అధికారులు సెలవు ప్రకటించారు. దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ మత్స్యకారులు సముద్ర చేపల వేటకు దూరంగా ఉండాలని, ప్రజలు బీచ్లు మరియు నది ఒడ్డున సందర్శించవద్దని సూచించింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు