భార‌త్ ఎవ‌రికీ త‌ల‌వంచ‌దు

భార‌త్ ఎవ‌రికీ త‌ల‌వంచ‌దు
అగ్ర‌రాజ్యం అమెరికా 50శాతం సుంకాలు విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ భార‌త్ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ భార‌త్ ఎవ‌రికీ త‌ల‌వంచ‌ద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌పంచంలో భార‌త్ భ‌విష్య‌త్తుపై ఆయ‌న‌ను ప్ర‌శ్నించిన స‌మ‌యంలో ఆయ‌న స్పందిస్తా చాలాబ‌లంగా, న‌మ్మ‌కంగా ఉంద‌ని తెలిపారు. 
 
ఇది ఏటా 6.5శాతం వృద్ధి చెందుతోంద‌ని, ఇది వేగ‌వంతం అయ్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ప్రపంచం “డీగ్లోబలైజేషన్”ను ఎదుర్కొంటున్నదనే భావనను ఆయ‌న తోసిపుచ్చారు. ప్ర‌పంచ దేశాలు ఇప్పుడు త‌మ‌కోసం వాణిజ్య మార్గాల‌ను, భాగ‌స్వాముల‌ను పునర్నిర్వచించుకుంటున్నాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. గ‌త ఏడాది కంటే ఈ సంవ‌త్స‌రం భారతదేశం ఎక్కువగా ఎగుమ‌తులు చేస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని పేర్కొన్నారు.

వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై, భారతదేశం విధానం కేవలం సుంకాల రాయితీలను కోరడం కంటే ఎక్కువగా ఉందని గోయల్ తెలిపారు. నాలుగు దేశాల ఈఈటిఏ గ్రూపుతో చ‌ర్చ‌ల‌ను గుర్తు చేశారు. 

భార‌త్‌ది నాలుగు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ అని, ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అని, మ‌న‌కు యువ శ‌క్తి ఉంద‌ని ఉంద‌ని తెలిపారు. ఈఈటిఏ సభ్య దేశాలు భారతదేశంలో 100 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాయని, దాంతో మిలియన్ ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం మీద 5 మిలియన్ల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని భరోసా వ్యక్తం చేశారు.

ఈఈటిఏ ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంద‌ని, దాని ప్రయోజనాలు కనిపిస్తాయ‌ని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చ‌చ్చిపోయింద‌ని వ్యాఖ్యానించ‌డంపై మండిప‌డ్డారు. కాంగ్రెస్ వార‌సుడిని ఎప్ప‌టికీ దేశం మ‌రిచిపోద‌ని ధ్వజమెత్తారు. ప్ర‌తికూల క‌థ‌నాల‌ను పున‌రావృతం సిగ్గుచేట‌ని దయ్యబట్టారు. 

భారతదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై మాట్లాడుతూ దేశ కరెన్సీ, విదేశీ మారక నిల్వలు, స్టాక్ మార్కెట్, ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని గోయల్ చెప్పారు. ప్రపంచ వృద్ధికి 16 శాతం తోడ్పడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం మొత్తం మనల్ని గుర్తిస్తుందనిని గోయ‌ల్ తెలిపారు.

భారతదేశంలోని 1.4 బిలియన్ల యువ నైపుణ్యం కలిగిన, ప్రతిష్టాత్మకమైన పౌరులు ప్రపంచ భాగస్వాములకు శక్తివంతమైన ఆకర్షణగా పేర్కొన్నారు. 2000 సంవత్సరం నుంచి భారతదేశంలో జరిగిన మార్పులను కూడా ఆయన ప్రస్తావించారు. వేలాది ఉద్యోగాలను సృష్టించడంలో విజ‌య‌వంత‌మైన ఐటీ పరిశ్రమను ప్ర‌శంసించారు. 

కరోనా సంక్షోభాన్ని దేశం ఎలా అవకాశంగా మార్చుకుందో కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సవాలుతో కూడిన సమయాల్లో భారతదేశం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంద‌ని భరోసా వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో భార‌త్ యూఏఈ, మారిషస్, ఆస్ట్రేలియా, ఈఈటిఏ బ్లాక్, యూకే, ఈయూ, చిలీ, పెరూ, న్యూజిలాండ్, యూఎస్‌, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చురుకుగా కొనసాగిస్తోందని, ఖరారు చేస్తోందని గోయల్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో భారతదేశం నేడు బలంగా, గౌరవంగా ఉంద‌ని స్పష్టం చేశారు.