బీజేపీలోకి ఐదుగురు బీఆర్ఎస్ ఎల్యేల్యేలు!

బీజేపీలోకి ఐదుగురు బీఆర్ఎస్ ఎల్యేల్యేలు!
* 10న బిజెపిలోకి మాజీ ఎమ్యెల్యే గువ్వల బాలరాజు!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో చెబుతామని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక తమ వైపు వారు చూస్తున్నారని పేర్కొన్నారు. 
అయితే ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలే కాదని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పకొచ్చారు. ఆగస్ట్ 10వ తేదీన బీజేపీలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరనున్నారని తెలిపారు. బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలా పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.
 
గువ్వల బాలరాజు శుక్రవారం రాంచందర్‌ రావు ఇంటికి వెళ్లి పార్టీలో చేరుతున్నట్లు తెలిపిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ఆయనతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
కాగా, ఫోన్ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు దోషులు బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం లేదని ఆరోపించారు. అయితే ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయన అసహనానికి పరాకాష్టగా తెలంగాణ ధ్వజమెత్తారు. బీసీల మీద ప్రేమ సీఎం రేవంత్ రెడ్డికి కొత్తగా వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతేకాదు అందుకు సంబంధించిన ఓ ఆడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరిగ్గా అలాంటి వేళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అబ్రహం.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిద్దరు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖారరైనట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభ విజయవంతమైన కొద్ది రోజులకే తన తండ్రి,బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ లేఖలో  మాజీ సీఎం కేసీఆర్ చుట్టు దయ్యాలు చేరాయంటూ ఆమె తీవ్రమైన వాఖ్యలు చేశారు.దీంతో బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ ఈ విమర్శలతో బహిర్గతమైనట్లు అయింది.

అదీకాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికల్లో అసలు సిసలు సూత్రధారి ఎవరనేది ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌ భవిష్యత్తుపై ఆ పార్టీలోని పలువురు నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.