డీజీపీ ఎదుట మరో 42 మంది మావోయిస్టులు లొంగుబాటు

డీజీపీ ఎదుట మరో 42 మంది మావోయిస్టులు లొంగుబాటు

తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టులకు చెందిన కీలక నాయకులతో సహ మొత్తం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారంతో లొంగిపోయారని పోలీసులు ప్రకటించారు.  ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు. ములుగు, భూపాలపల్లి మీదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు.

మావోయిస్టు నేత హిడ్మా పీఎల్‌జీఏను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవాకు, కేశాలుకు అప్పగించారు. అయితే, కొన్ని రోజులు కిందటే  పీఎల్‌జీఏ కమాండర్ దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుపోయారు. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సోడిమల్ల కేశాలు సైతం తాజాగా నేడు లొంగిపోయారు. ఇతనికి సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున్నాయి.

పీఎల్‌జీఏ బెటాలియన్‌ కమాండర్‌, డీకేఎస్‌జెడ్‌సీ సభ్యుడు సోడి మల్ల ఎలియాస్‌ కేషాల్‌, జేఎంఎండబ్ల్యూసీ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి చాప నారాయణ అలియాస్‌ గజేందర్‌, బీకే ఎఎస్‌ఆర్‌ డివిజనల్‌ కమిటీ సభ్యుడు కడ్తి  సన్నుతో లొంగిపోయారు.  ఐదు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిళ్లు, మూడు ఇన్‌సాస్‌ రైఫిళ్లు, ఆరు 303 రైఫిళ్లు, ఒక 9ఎంఎం స్టెన్‌ గన్‌, రెండు 8 ఎంఎం రైఫిళ్లు, పది సింగిల్‌ షాట్‌ గన్స్‌, ఒక 9 ఎంఎం పిస్టల్‌, రెండు రివాల్వర్లు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు.

42 మంది జనజీవన స్రవంతిలో కలవడం ద్వారా సీపీఐ మావోయిస్టు లోని మూడు మ్యాజిక్‌ వెపన్స్‌లో అత్యంత కీలకమైన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్టీ పూర్తిగా కనుమరుగు అయిందని డిజిపి తెలిపారు. లొంగిన మావోయిస్టులకు రూ. 1.93 కోట్ల రివార్డును త్వరలో అందజేస్తామని వివరించారు.