కాల్పుల విరమణతో 20 శాతం తగ్గిన క్రూడాయిల్ ధరలు

కాల్పుల విరమణతో 20 శాతం తగ్గిన క్రూడాయిల్ ధరలు
ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంతో కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా  చమురు, గ్యాస్ రవాణాకు కీలకంగా ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ అంటూ చేసిన ప్రకటనతో గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
కిందటి రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల స్థాయిలో ఉండగా, ఏప్రిల్ 7 రాత్రి నుంచి ఏప్రిల్ 8 ఉదయం వరకు ఇంట్రాడేలో ఏకంగా 20 శాతం వరకు తగ్గి ఒక దశలో 90.01 డాలర్ల స్థాయికి పడిపోయింది.  ఉదయం 7.30 గంటలకు కూడా దాదాపు 18 శాతం పతనంతో 94 డాలర్ల స్థాయిలో ఉంది. యుద్ధానికి ముందు క్రూడాయిల్ ధర 70 డాలర్లకు దిగువగా ఉండగా, ఇటీవల అది 120 డాలర్ల స్థాయికి కూడా చేరింది. 

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు పడిపోవడంతో ఆసియా మార్కెట్లు, అమెరికా స్టాక్ ఫ్యూచర్స్‌ పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లు సూచీలు భారీ లాభాలతో ప్రారంభయ్యాయి.​ సెన్సెక్స్‌ 2,700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 800 పాయింట్లకిపైగా లాభల్లో ట్రేడ్​ అవుతున్నాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి.

అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా బలపడుతోంది. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు పెరిగింది. ప్రస్తుతం 92.56 వద్ద కొనసాగుతోంది.  జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 4.8% పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సి 5.6 శాతం లాభపడింది. ఈస్టర్న్‌ డేలైట్ సమయం ప్రకారం రాత్రి 9న్నర గంటల సమయానికి అమెరికాలో ఎస్‌ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 2.3శాతం, డౌ ఫ్యూచర్స్ 2శాతం వృద్ధి చెందాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.

యుద్ధ భయాలు తొలగిపోవడం, ఇరాన్ నుండి చమురు సరఫరా పెరిగే అవకాశం ఉండటంతో వ్యాపారులు అమ్మకాలకు మొగ్గు చూపారు, దీనివల్ల ధరలు ఒక్కసారిగా ‘ఢమాల్’ అన్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 8,692 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 7,979 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

చమురు దిగుమతి బిల్లు తగ్గడం వల్ల రూపాయి విలువ పెరగడమే కాకుండా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ఇరాన్‌పై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే, భారత్‌కు ఆ దేశం నుండి తక్కువ ధరకే చమురు లభించే మార్గం సుగమం అవుతుంది, ఇది భారత వాణిజ్య లోటును తగ్గించడానికి దోహదపడుతుంది.