ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన మూడీస్‌

ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన మూడీస్‌
మూడీస్‌ రేటింగ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను 6శాతానికి తగ్గించింది. గతేడాది ఆర్థిక వృద్ధి 6.8శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో వృద్ధి వేగం మందగిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందని మూడీస్‌ పేర్కొంది. భారతదేశ క్రెడిట్‌ రేటింగ్స్‌పై నివేదికను మూడీస్‌ ఆదివారం విడుదల చేసింది. 

యుద్ధం కారణంగా దీర్ఘకాలిక అంతరాయాలు ముఖ్యంగా ఎల్‌పిజి రవాణా కారణంగా భవిష్యత్తులో గృహాలకు ఎల్‌పిజి కొరత, అధిక ఇంధన, రవాణా ఖర్చులకు అలాగే దిగుమతి చేసుకున్న ఎరువులపై భారత్‌ ఆధారపడటంతో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పేర్కొంది.

”పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అధిక ధరలు, పెరిగిన ముడి సరుకుల వ్యయాల మధ్య ప్రైవేట్‌ వినియోగం క్షీణించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం బలహీనం కావడం భారతదేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం దృష్ట్యా 2026-27లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు గతంలో 6.8 స్థాయి నుండి తగ్గి 6శాతానికి పరిమితమవుతుందని అంచనావేస్తున్నాం” అని మూడీస్‌ నేవిక తెలిపింది.

”ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ భౌగోళిక, రాజకీయ ఇబ్బందులు ద్రవ్యోల్బణ అంచనాలను పెరుగుదల దిశగా మళ్లించాయి” అని మూడీస్‌ పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 2.4శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, 2027లో సగటున 4.8శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.  ద్రవ్యోల్బణ ముప్పు తలెత్తడం, వృద్ధి బలంగా కొనసాగడంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో పాలసీ రేట్లు స్థిరంగా కొసాగవచ్చు లేదా క్రమంగా పెరగవచ్చు అని పేర్కొంది. పెరిగిన చమురు, గ్యాస్‌, ఎరువల ధరలు నిర్దేశిత సబ్సిడీపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తాయని, ఫలితంగా బడ్జెట్‌తో పోలిస్తే రాబడి క్షీణతతో పాటు అధిక వ్యయాలకు దారితీయవచ్చని పేర్కొంది.