ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికల నగారా

ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికల నగారా
 
“గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.. కాబట్టి ఎదుర్కొని విజయం సాధించేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కా ర్యకర్త సిద్ధంగా ఉండాలి” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ – గోల్కొండ జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొంటూ  ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో లేదా వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉందని తెలిపారు. 
 
బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవాలని, అన్ని బూత్ కమిటీల నియామకాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ, ‘స్పెషల్ సమ్మరీ రివిజన్‘ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు తమ డివిజన్‌లో కొత్త ఓట్లను నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఇంకా బూత్ స్థాయి కార్యకర్తలందరికీ రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. 
 
వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రజలనూ కలుపుకుని వెళ్లేందుకు త్వరలో పార్టీ పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం బాబూ జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 6న బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని, 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ప్రజలతో కలిసి నిర్వహించుకోవాలని ఆయన చెప్పారు. 
 
సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్, జోనల్ కమిషనర్, జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తన కార్యాలయం నుండి అధికారిక లేఖలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.