భూతల దాడులకు 7 మిలియన్ల ఇరానీయులు సిద్ధం

భూతల దాడులకు 7 మిలియన్ల ఇరానీయులు సిద్ధం

None

రానున్న రెండు, మూడు వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ  అమెరికా బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా జరిపే ఏ భూతల దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా 7 మిలియన్ల ఇరానీయులు సిద్ధంగా ఉన్నారని  ఇరాన్ పార్లమెంట్ స్పీకర్   మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు.
 
“ప్రస్తుతం, కేవలం ఒక వారంలోపే, దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న ఒక శక్తివంతమైన జాతీయ ఉద్యమం సుమారు 70 లక్షల మంది ఇరానియన్లను ముందుకు తీసుకువచ్చింది. వీరందరూ ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఆయుధాలు ధరించి మన దేశ రక్షణ కోసం నిలబడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు,” అని గాలిబాఫ్ ఎక్స్ లో రాశారు.
 
ఇస్ఫహాన్‌లోని మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారాలలో ఒకదానిని మూసివేసిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా, యూఏఈ,  బహ్రెయిన్‌లలోని అమెరికాతో సంబంధం ఉన్న ఉక్కు,  అల్యూమినియం కర్మాగారాలపై “హెచ్చరిక” దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) మరోవంక ప్రకటించింది.  ఇరాన్‌ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయని, వారి నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీశామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారవేస్తూ తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని, అమెరికా అవమానానికి గురై, పశ్చాత్తాపపడి, లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని గట్టి హెచ్చరిక ఇచ్చింది. 

మరోవైపు, తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్కు చెందిన అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, వ్యూహాత్మక క్షిపణులు, ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతోపాటు సైనిక మౌలిక సదుపాయాలు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లను ధ్వంసం చేశామని ట్రంప్‌ ఇదివరకే పేర్కొన్నారు. 

అయితే ఆ వాదనలను ఇరాన్ ఖండించింది. అదేవిధంగా, ఇరాన్‌ను రాతియుగంలోకి పంపిస్తామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా విరుచుకుపడింది. రాతియుగం నాటి నేరాలను ఆధునిక యుగానికి అమెరికా తీసుకొస్తోందని విమర్శించింది. చిన్నారుల హత్యలు, మానవత్వానికి మచ్చతెచ్చే నేరాలను ఆధునిక ప్రపంచంలోకి తెస్తోందని మండిపడింది.

‘‘మేం అమెరికా బాంబుల కారణంగా రాతియుగంలోకి వెళ్లడం లేదు. మాకు 7,000 ఏళ్ల నాగరిక చరిత్ర ఉంది. చరిత్రకు ఈ విషయం తెలుసు. అమాయకులైన పిల్లల్ని చంపి, అమానవీయ నేరాలు చేస్తున్న మీరు రాతియుగాన్ని ఆధునిక ప్రపంచంలోకి తెచ్చారు అనేది స్పష్టం’’ అని తేల్చి చెప్పింది. ఇరాన్‌తో యుద్ధంపై బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేస్తూ తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం కారణంగా ఆ దేశం రాతియుగంలోకి వెళ్తుందని పేర్కొన్నారు.

ఇరాన్ సైన్యం, నేవీ పూర్తిగా బలహీనపడిపోయాయని చెప్పారు. యుద్ధాన్ని రెండు, మూడు వారాల్లో ముగిస్తామని తెలిపారు. అయితే, ఇరాన్ మిలిటరీ మాత్రం ట్రంప్‌ ప్రకటనకు ధీటుగా స్పందించింది.  అమెరికాకు తీవ్ర అవమానం జరిగే వరకు యుద్ధాన్ని వదలేది లేదని, అమెరికా పశ్చాత్తాప పడి, లొంగిపోయే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అమెరికా తమను తక్కువగా అంచనా వేసిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు. 

తమ దేశం దగ్గరున్న సైనిక శక్తి, మిస్సైళ్ల తయారీ గురించి అమెరికా ఇంటెలిజెన్స్‌కు సరిగ్గా తెలియదని పేర్కొంటూ లాంగ్ రేంజ్ అటాక్ మిస్సైల్స్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ వంటివి తమ దేశం దగ్గరున్నాయని ఇరాన్ ప్రతినిధి మీడియాతో తెలిపారు.