హింస మరింత సంఘర్షణకే దారితీస్తుంది.. దలైలామా హెచ్చరిక 

హింస మరింత సంఘర్షణకే దారితీస్తుంది.. దలైలామా హెచ్చరిక 
మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌లలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, హింస మరింత సంఘర్షణకు మాత్రమే దారితీస్తుందని బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా మార్చి 31న హెచ్చరిస్తూ, శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.మధ్యప్రాచ్యంలో లేదా రష్యా-ఉక్రెయిన్ మధ్య మనం చూస్తున్న సంఘర్షణలతో సహా, సంఘర్షణలకు శాశ్వత పరిష్కారం సంభాషణ, దౌత్యం, పరస్పర గౌరవంలో పాతుకుపోయి ఉండాలని స్పష్టం చేశారు. అత్యంత లోతైన స్థాయిలో మనమందరం తోబుట్టువులమనే అవగాహనతో దీనిని సాధించాలి అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూచించారు. 
 
మతాలు సహనాన్ని, శాంతిని బోధిస్తాయని, హింసను ఖండిస్తాయని చెబుతూ  ఏ ఆధ్యాత్మిక సంప్రదాయంలోనూ హింసకు స్థానం లేదని వెల్లడించారు. అలాగే, మతాల మధ్య కరుణ, సహనం, సామరస్యం వంటి ఉమ్మడి విలువలను ప్రముఖంగా ప్రస్తావించారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ఇటీవలే పోప్ లియో-14 చేసిన విజ్ఞప్తిని దలైలామా సమర్ధిస్తూ  ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

“పామ్ సండే ప్రార్థనల సందర్భంగా పోప్-14 శాంతి కోసం శక్తివంతమైన విజ్ఞప్తిని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. శాంతి కోసం ఆయుధాలను విడిచిపెట్టాలని, హింసను త్యజించాలని ఆయన చేసిన పిలుపు నన్ను ఎంతగానో కదిలించింది. ఎందుకంటే అన్ని ప్రధాన మతాలు ఇదే సారాంశాన్ని భోదిస్తాయి” అని తెలిపారు. 

“క్రైస్తవ మతం, బౌద్ధ మతం, ఇస్లాం, హిందూ మతం, యూదు మతం లేదా ప్రపంచంలోని ఏ గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని చూసినా వాటి సందేశం ప్రాథమికంగా ఒక్కటే. ప్రేమ, కరుణ, సహనం ఆత్మ నిగ్రహం. ఈ మతాల బోధనలలో దేనిలోనూ హింసకు స్థానం లేదు. హింస మరింత హింసను మాత్రమే సృష్టిస్తుంది. అది శాంతికి ఎప్పటికీ శాశ్వత పునాది కాదని చరిత్ర మనకు పదేపదే తెలియజేసింది. ” అని దలైలామా స్పష్టం చేశారు.  ప్రపంచ ఐక్యతకు టిబెట్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు శాంతి కోసం కృషి చేయాలని కోరారు. పశ్చిమాసియా సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న హింస, సంఘర్షణలు త్వరగా ముగియాలని ఆకాంక్షించారు. “పశ్చిమాసియా, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సంఘర్షణలకు శాశ్వత పరిష్కారం చర్చలు, దౌత్యం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుంది. మనమందరం తోబుట్టువులమనే అవగాహనతో ఈ సంఘర్షణలను పరిష్కరించుకోవాలి.” అని దలైలామా హితవు చెప్పారు. 

కొద్ది రోజుల క్రితం రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన పామ్ సండే ప్రార్థనల సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభం గురించి పోప్ లియో-14 పరోక్షంగా స్పందించారు. యుద్ధం చేసేవారి ప్రార్థనలను దేవుడు (యేసు క్రీస్తు) ఆలకించడని తెలిపారు. పైగా ఆ ప్రార్థనలను తిరస్కరిస్తాడని చెప్పారు. పీడితుల పక్షాన దేవుడు నిలుస్తాడని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి పిలుపునిచ్చారు.

“సోదర సోదరీమణులారా మన దేవుడు యేసు శాంతికే రాజు. ఆయన యుద్ధాన్ని తిరస్కరిస్తాడు. యుద్ధాన్ని సమర్థించుకోవడానికి యేసును ఎవరూ ఉపయోగించుకోలేరు. జీసస్ యుద్ధం చేసేవారి ప్రార్థనలను వినడు. వాటిని తిరస్కరిస్తాడు. పశ్చిమాసియాలోని క్రైస్తవుల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారు ఈ పవిత్ర దినాల ఆచారాలను పాటించలేకపోతున్నారు.” అని పోప్ లియో-14 పేర్కొన్నారు.