బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండ‌ర్ పేస్

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండ‌ర్ పేస్
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ బీజేపీలో చేరారు. భారతదేశపు అత్యంత విజయవంతమైన టెన్నిస్‌ క్రీడాకారులలో ఒకరిగా పరిగణించబడే పేస్‌ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, సుకాంత మజుందార్‌ కూడా పాల్గొన్నారు. 
 
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను పటిష్టం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ సందర్భంగా కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ  ”లియాండర్‌ పేస్‌ బీజేపీ కుటుంబంలో చేరడం చారిత్రాత్మకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గత 12 ఏళ్లుగా క్రీడలను, క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు” అని తెలిపారు. 
 
మరోవైపు లియాండర్‌ మాట్లాడుతూ ఇది తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు అని అభివర్ణించారు. ”ఇది నా జీవితంలో ఒక గొప్ప రోజు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా జీ, నితిన్‌ నవీన్‌ జీలకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. క్రీడలకు, యువతకు సేవ చేయడానికి ఇది నాకు లభించిన గొప్ప అవకాశం,” అని తెలిపారు. తన కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి తాను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని పేస్‌ పేర్కొన్నారు.
 
 ”నేను 40 ఏళ్లుగా దేశం కోసం ఆడాను, ఇప్పుడు యువతకు సేవ చేయాల్సిన సమయం వచ్చింది” అని చెప్పారు.  అనేక టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించాన‌ని, డేవిస్ క‌ప్‌, ఒలింపిక్స్‌లో ఆడి త‌న‌కు, త‌న కుటుంబానికి, దేశానికి గౌర‌వాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు కొత్త రంగంలోకి ప్రవేశిస్తున్నాన‌ని, త‌న సోద‌రులు త‌న‌కు బాధ్య‌త‌ను అప్పగించార‌ని తెలిపారు. 
 
లియాండర్‌ పేస్‌ కేంద్ర ప్రభుత్వ క్రీడా కార్యక్రమాలను కూడా ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ”ఖేలో ఇండియా ఉద్యమం, టాప్స్‌ పథకం అద్భుతమైన కార్యక్రమాలు. టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్ల ప్రదర్శనను నిర్ధారించడానికి కిరణ్‌ రిజిజు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ప్రధానమంత్రి ఆయనకు అప్పగించిన పాత్రను ఆయన చాలా చక్కగా నిర్వర్తించారు” అని కొనియాడారు. 
 
కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌ను కోల్‌క‌తాలో పేస్ క‌లిశారు.దీంతో టెన్నిస్ స్టార్ బీజేపీలో చేరుతార‌న్న ఊహాగానాలు వినిపించాయి. 2021లో లియాండ‌ర్ పేస్ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022 గోవా ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. కానీ పేస్ ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా పోటీచేయలేదు.