పాలస్తీనియన్‌లు ఉగ్రదాడులకు పాల్పడితే మరణదండనే

పాలస్తీనియన్‌లు ఉగ్రదాడులకు పాల్పడితే మరణదండనే
ఉగ్ర దాడులకు పాల్పడిన పాలస్తీనీయులకు మరణశిక్ష విధించేలా ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాదాపు పన్నెండు గంటల చర్చ తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడిన వారందరికీ మరణశిక్ష విధించే అధికారం అక్కడి కోర్టులకు ఉంటుంది. శిక్ష విధించిన 90 రోజులలోపు ఆ శిక్షను అమలుచేయాలి.
ఈ బిల్లు ప్రకారం, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో, ఇజ్రాయెల్ సైనిక న్యాయస్థానం “ఉగ్రవాద చర్యలు”గా పరిగణించే ప్రాణాంతక దాడులను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు దోషులుగా తేలిన పాలస్తీనియన్లకు మరణశిక్షను ప్రామాణిక శిక్షగా విధించవచ్చు. ఈ చట్టం, జాతీయవాద హత్యల కేసులో దోషులుగా తేలిన వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్లకు ఉరిశిక్షను ప్రామాణిక శిక్షగా నిర్దేశిస్తుంది. 
 
అంతేకాకుండా, ఇలాంటి ఆరోపణలపై దోషులుగా తేలిన ఇజ్రాయెల్ పౌరులకు కూడా మరణశిక్ష విధించే అవకాశాన్ని ఇది ఇజ్రాయెల్ న్యాయస్థానాలకు కల్పిస్తుంది. అయితే, ఈ నిబంధన మరణశిక్ష విధించదగిన వారిని కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనియన్ పౌరులకే పరిమితం చేసి, యూదు పౌరులను మినహాయిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. 
ఈ బిల్లు ప్రకారం, ఇజ్రాయెల్ క్రిమినల్ కోర్టులలో “ఇజ్రాయెల్ రాజ్యం ఉనికిని అంతం చేయాలనే ఉద్దేశంతో, ఒక ఇజ్రాయెల్ పౌరుడికి లేదా నివాసికి హాని కలిగించే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మరణానికి కారణమైన” ఎవరికైనా మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది.  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించారు.
2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లోని ఓ ప్రాంతంపై హమాస్‌ చేసిన ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  అయితే ఆ దాడులకు పాల్పడిన నిందితులకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పౌరులు, నివాసితులను ఈ చట్టం నుంచి మినహాయించినప్పటికీ, ప్రత్యేక నిబంధన ప్రకారం ఉగ్ర కార్యకలాపాలతో ఒక వ్యక్తి మరణానికి కారణమైన ఇజ్రాయెలీలకు సైతం ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్‌ పార్లమెంట్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. సొంత చట్టాలను ప్రవేశపెట్టుకొనే హక్కు ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌కు ఉందని పేర్కొంది. కాగా సుదీర్ఘ సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌ పార్లమెంట్ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. దాంతో ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదు.  సాధారణంగా ప్రభుత్వ పదవీకాలం పూర్తికాకముందే ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నిర్వహిస్తారు. నెతన్యాహు ప్రభుత్వం నాలుగేళ్ల పదవీకాలం మరికొన్ని నెలల్లో పూర్తి కానుంది. అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం.