నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం భక్తాపూర్‌లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్‌ లేఖక్‌ను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.  దేశంలో కొత్తగా ఎన్నికైన యువ ప్రధాని, మాజీ రాపర్‌ బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 
‘వారిని (మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖాక్) ఈ ఉదయం అరెస్టు చేశాం. చట్ట ప్రకారం ప్రక్రియ ముందుకు సాగుతుంది’ అని కాఠ్మండు వ్యాలీ పోలీసు ప్రతినిధి ఓం అధికారి తెలిపారు. ఓలీ అరెస్టు జరిగిన కొద్ది నిమిషాలకే, కొత్తగా నియమితులైన హోం వ్యవహారాల మంత్రి సుడాన్ గురుంగ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. 
‘‘మేము మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదు. ఇది కేవలం న్యాయానికి నాంది మాత్రమే. ఇప్పుడు దేశం కొత్త దిశను తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కాగా, ఈ అరెస్ట్‌పై ఓలీ మాట్లాడుతూ  ఇది కక్షపూరిత చర్యని ఆరోపించారు. తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ‘జెన్ జీ’  నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింస, మరణాలకు సంబంధించి ఆయనపై  కేసు నమోదైంది.  ఆ నిరసనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది యువకులతో సహా 70 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తాజాగా, ఈ ఘటనపై విచారణ జరిపిన ‘గౌరీ బహదూర్‌ కార్కీ కమిషన్‌’, అప్పటి ప్రధాని ఓలీ, హోంమంత్రి రమేష్‌ లేఖక్‌లు హింసకు కారకులని తేల్చింది.
జెన్‌ జీ నిరసనల సమయంలో పరిస్థితి ఉద్రిక్తమవుతుందని ముందే సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని దర్యాప్తు కమిషన్ పేర్కొంది. అలాగే నిర్లక్ష్యం, అవివేకం కారణంగా భారీ ప్రాణనష్టం జరిగిందని తెలిపింది. ఈ కేసులో ఓలీ, లేఖక్​, అప్పటి పోలీస్ ఇన్​స్పెక్టర్ జనరల్ చంద్ర కుబేర్​పై జాతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 181, 182 కింద కేసులు నమోదలు చేయాలని సూచించింది.
ఈ నేరాలకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. మరోవైపు ఓలీ అరెస్ట్​ను ఆయన పార్టీ సీపీఎన్, యూఎంఎల్ తీవ్రంగా ఖండించింది ఈ అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవని, ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించింది.