యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ క్షిపణి ప్రయోగం!

యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ క్షిపణి ప్రయోగం!
* ఇరాన్‌పై 15 వేలకుపైగా బాంబులు వేశాం
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై క్రూయిజ్ క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ భూభాగానికి సమీపిస్తే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ నేవీ హెచ్చరించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకల సమూహాన్ని తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్ నౌకాదళ కమాండర్ తెలిపారు. 
 
ఆ విమాన వాహక నౌక తమ క్షిపణి వ్యవస్థ పరిధిలోకి వచ్చిన మరుక్షణమే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఆ కమాండర్ బుధవారం ఉదయమే హెచ్చరించారు. కాగా, ఈ హెచ్చరిక నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక దిశగా తీరప్రాంత క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ సైనిక ప్రజా సంబంధాల విభాగం తెలిపింది.  ‘ఇరాన్ నౌకాదళానికి చెందిన ఖాదర్ క్రూయిజ్ క్షిపణులు అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకున్నాయి. దాని స్థానాన్ని మార్చుకునేలా బలవంతం చేశాయి’ అని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను రిలీజ్‌ చేసింది. అయితే అమెరికా దీనిని ధృవీకరించలేదు. కాగా, ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌పై 15 వేల బాంబులు వేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు.  గత ఏడాది జూన్‌లో 12 రోజులపాటు జరిగిన సంఘర్షణ సమయంలో కంటే నాలుగు రెట్లు బాంబులు ఉపయోగించినట్లు తెలిపారు. ఇరాన్‌లోని 3,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు చెప్పారు.