ఏపీలో మూడు పుణ్యక్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ మార్గాలు

ఏపీలో మూడు పుణ్యక్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ మార్గాలు
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం మూడు కీలక గిరి ప్రదక్షిణ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ప్రకటించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో చారిత్రాత్మక రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుండి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించారు.
గతంలో రాళ్లు, రప్పలు, ముళ్ళ పొదలతో నిండి భక్తులకు ఇబ్బందిగా ఉన్న ఈ మార్గాన్ని ఇప్పుడు సుందరమైన బీటీ రోడ్డుగా తీర్చిదిద్దారు. ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చామని, తాజాగా రామతీర్థం మార్గాన్ని పూర్తి చేశామని వివరించారు. 

ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ క్షేత్రంలో కూడా గిరి ప్రదక్షిణ మార్గం కోసం నిధులు మంజూరు చేశామని, త్వరలోనే అక్కడ కూడా పనులు పూర్తి చేసి భక్తులకు అంకితం చేస్తామని వెల్లడించారు. గత 20 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు సుమారు రూ.40 కోట్లకు పైగా నిధులతో రోడ్డు సౌకర్యాలు కల్పించడం విశేషం.

శ్రీరామనవమికి రెండు రోజుల ముందే రామతీర్థంలో గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. రామతీర్థం అనగానే వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఘటన గుర్తొచ్చి బాధ కలిగేదని, నేడు అదే శ్రీరాముడి గిరిప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, ఆనం రామనారాయణరెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి వర్చువల్గా హాజరయ్యారు.

“రామతీర్ధం పేరు వినగానే రాముడి విగ్రహం ధ్వంసమే గుర్తుండిపోయింది. దశాబ్దాలుగా భక్తుల కలగా మారిన గిరిప్రదక్షిణ మార్గాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉంది. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో పని పూర్తయింది. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, అధికారులకు అభినందనలు. దూపదీప నైవేద్యం పథకం ద్వారా పలు ఆలయాల అభివృద్ధి చేపట్టాం. శ్రీకాళహస్తి, కోటప్పకొండ, రామతీర్థాల గిరిప్రదక్షిణ మార్గాలను అభివృద్ధి చేశాం” అని పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. 

రామతీర్థం క్షేత్రానికి రామాయణ, మహాభారత కాలం నాటి విశిష్టత ఉందని, ఇక్కడ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి వంటి పర్వదినాల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు.  దేవాలయాల పవిత్రతను కాపాడటంతో పాటు, దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వామివారి సేవలో ఈ అదృష్టం కలగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.