తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు

తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు

తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ ఏడాది నుండే అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. రైతు రుణాలను ప్రభుత్వం మాఫి చేసిందని పేర్కొన్నారు.

రానురాను రాష్ట్రంలో సాగు భారంగా మారుతోందని బిజెపి శాసనసభాపక్ష ఉపనేత పాయలశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా  బడ్జెట్ పద్దులపై ఆయన శాసనసభలో మాటలాడుతూ వ్యవసాయం చేసి అప్పుల పాలవడం కంటే ఏదైనా కూలి చేసుకుని బతికొచ్చన్న ఆలోచనకు రైతులు వస్తున్నారని, కనీసం కౌలుకు తీసుకుని కూడా సాగు చేయడంపై మొగ్గు చూపడం లేదని తెలిపారు. 

రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో చిక్కుకుపోయిందని పేర్కొంటూ వాటిని ఎలా తీరుస్తారో పేర్కొంటూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఓటర్లను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను రూపొందించిన సిఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు హామీల అమలుపై మాత్రం సంతకం చేయడం లేదని విమర్శించారు. 

రైతులకు బ్యాంకులు సరిపడా రుణాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఎప్పటి నుండి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు వ్యవసాయ జెడిలు లేరని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రైతులుతమ పొలాలకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. 

భూసార పరీక్షలు క్రమంతప్పకుండా నిర్వహించేలా వ్యవసాయ అధికారులపై పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో 90 శాతం సబ్సిడితో రైతులకు పాలిహౌజ్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. టమాట రైతుల బాధలు వర్ణతాతీతంగా ఉన్నాయని చెబుతూ కిలో రూపాయి కూడా రైతుకు రావడం లేదని తెలిపారు.