మిలిటరీ ప్రమోషన్ల విధానంలో ఉన్న వ్యవస్థీకృత లోపాలను కోర్టు ఎత్తి చూపింది. మహిళా ఎస్ఎస్సీ ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ను ఇవ్వకపోవడం విధాన నిర్ణయం లోపమని కోర్టు చెప్పింది. ప్రతి ఏడాదికి కేవలం 250 మంది మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలన్న నిబంధనను కూడా కోర్టు కొట్టిపారేసింది. ఆ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, దాంట్లో పవిత్రత లేదని కోర్టు పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మిలిటరీలో లింగ సమానత్వాన్ని సూచిస్తున్నది. పర్మనెంట్ కమిషన్ పొందినవారు రిటైర్మెంట్ వయసు వరకు విధులు నిర్వర్తించవచ్చు. సైన్యంలో ఉన్నత పదువులను గతంలో కేవలం పురుషులకు మాత్రమే ఇచ్చేవారు. అయితే తాజా తీర్పుతో మహిళలకు కూడా అత్యున్నత హోదా దక్కే అవకాశాలు ఉన్నాయి.
పర్మనెంట్ కమిషన్ అనేది తమకే ఉంటుందన్న భావనలో మేల్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు ఉండరాదు అని కోర్టు చెప్పింది. మహిళా ఆఫీసర్ల పట్ల ఉన్న వివక్ష అది విధాన రూపకల్పన లోపమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. మహిళా ఆఫీసర్లకు చెందిన వార్షిక విశ్వసనీయ నివేదిక(ఏసీఆర్)లను మిలిటరీ ఆఫీసర్లు చాలా తేలికగా తీసుకుంటున్నట్లు కోర్టు చెప్పింది.
అలాగే, త్రివిధ దళాల్లోని మహిళా అధికారులకు పూర్తి పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సైన్యం, నౌకాదళం, వాయుసేనలోని మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులకు పూర్తి పింఛన్ ప్రయోజనాలు పొందటానికి హక్కు ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

More Stories
ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రిజ్, మహిళలకు స్కూటీకి రూ.25 వేలు
కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు
గుజరాత్ లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు