బాంబుల మోతల మధ్య చెస్ ఆడలేను

బాంబుల మోతల మధ్య చెస్ ఆడలేను
భారత ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిటేట్స్ టోర్నమెంట్ నుంచి ఆమె వైదొలిగింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నందున భదత్రపై ఆందోళనగా ఉందని చెప్పిన ఆమె  బాంబుల మోతల మధ్య చెస్‌పై శ్రద్ధ పెట్టడం సాధ్యమవ్వదని వాపోయింది. ఇదివరకే టోర్నీ వేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హంపి చివరకు టోర్నీని బహిష్కరించాలని  భావించింది.
ఈ విషయాన్ని సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించిందీ గ్రాండ్‌మాస్టర్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత క్రీడాకారిణులు ప్రధాన టోర్నీలకు దూరమవుతున్నారు. దుబాయ్‌లో చిక్కుకొని ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు పీవీ సింధు దూరమవ్వగా  కోనేరు హంపి సైతం మెగా ఈవెంట్‌ నుంచి వైదొలిగింది. మధ్య ఆసియాలోని సిప్రస్‌లో మార్చి 28 నుంచి మొదలయ్యే ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో తాను ఆడడం లేదని సోమవారం హంపి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

“చాలా సమయం ఆలోచించి నేను కీలక నిర్ణయం తీసుకున్నాను. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ నుంచి వైదొలుగుతున్నా. వ్యక్తిగత భద్రత, సురక్షితంగా ఉండడం కంటే ఏ ఈవెంట్ ముఖ్యమైనది కాదు. నిర్వాహకులు భరోసా కల్పించినప్పటికీ ప్రస్తుతం అక్కడి పరిస్థితుల్లో నేను సురిక్షితంగా ఉంటానని నాకు అనిపించడం లేదు. ఈ నిర్ణయం బాధతో కూడినదే. కానీ, తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను”అని హంపి తన పోస్ట్‌లో వెల్లడించింది.

హంపి వైదొలగడంతో ఆమె స్థానంలో ఉక్రెయిన్ అమ్మాయి అన్నా ముజిచుక్ క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపికైంది. అయితే టోర్నీలో ఆడనందుకు హంపిపై భారీ జరిమానా పడింది. నిబంధనల ప్రకారం టోర్నీని బహిష్కరించినందుకు ఆమె 10 వేల యూరోల జరిమానా చెల్లించనుంది. హంపి వైదొలగడంతో ఈ టోర్నీకి ఎంపికైన భారత యువకెరటాలు దివ్య దేశ్‌ముఖ్, ఆర్.వైశాలి పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.