పశ్చిమాసియాలో సైనిక చర్య తగ్గింపు దిశగా అమెరికా

పశ్చిమాసియాలో సైనిక చర్య తగ్గింపు దిశగా అమెరికా
* ఇరాన్ చమురుపై ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేత 
 
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం మూడు వారాలు దాటినా సమయంలో యుద్ధ తీవ్రత తగ్గింపుపై సానుకూల సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఒక వంక సైనిక చర్యను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించింది.  ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను ఒక నెలపాటు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ఎక్స్​లో పోస్ట్ చేశారు.
ఈ తాత్కాలిక సడలింపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చి ఏప్రిల్ 19 వరకు కొనసాగనుంది.  ఈ నిర్ణయం వెనక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచ ఇంధన సరఫరాను పెంచి, ధరల పెరుగుదలను నియంత్రించడమే అని చెప్పారు. ప్రస్తుతం నిల్వలో ఉన్న ఇరాన్ చమురును విడుదల చేయడం ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెల్స్ చమురు గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. దీంతో సరఫరా ఒత్తిడి తగ్గి ధరలు స్థిరపడే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు, పశ్చిమాసియాలో సైనిక చర్యలను క్రమంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, లాంచర్లు పూర్తిగా నిర్వీర్యం చేయడం, రక్షణ రంగ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం తమ లక్ష్యంలో భాగమని చెప్పారు. 

ఇరాన్ నౌకాదళం, వాయుసేనను తుడిచిపెట్టడం, ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడటం తమకు కీలకమని చెప్పారు. అయితే, ఇరాన్‌తో కాల్పుల విరమణపై ఇప్పటికీ ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై భూతల దాడులకు రంగంలోకి యూఎస్‌ఎస్‌ ట్రిపోలి

ఇలా ఉండగా, ఇరాన్‌పై భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధ రంగంలోకి ఉత్తర అరేబియా సముద్రంలో యుద్ధ క్షేత్రంలోకి 2,000 మంది నావికులతో అమెరికా యుద్ధ విమానాల వాహకనౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలి వచ్చేవారం ప్రవేశించనున్నది. 50,000 టన్నుల బరువైన ఈ నౌక ప్రవేశంతో ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం భవిష్యత్తు తేలిపోతుంది. 

ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దక్షిణం వైపున ఉన్న ట్రిపోలి గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో మోహరించి ఉన్న యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌కు మరింత బలం చేకూర్చనున్నది. 844 అడుగుల పొడవుండే యూఎస్‌ఎస్‌ ట్రిపోలిపైన ఎఫ్‌-35, ఎంవీ-22 అస్ప్రీ, ఎంహెచ్‌60ఎస్‌ సీహాక్‌ హెలికాప్టర్లు ఉంటాయి. మార్చి 22-23 తేదీల్లో ఈ నౌక యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆంక్షలకు గురైన ఇరాన్ చమురును చైనా చౌకగా నిల్వ చేస్తోందని బిసెంట్ తెలిపారు. ఆ చమురును ప్రపంచ మార్కెట్‌కు అందించడం ద్వారా సరఫరా పెంచాలని పేర్కొ న్నారు. అయితే ఈ అనుమతి కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికే సముద్రంలో ఉన్న చమురుకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా చమురు కొనుగోలు లేదా ఉత్పత్తికి అనుమతి లేదని తెలిపారు. 

ఇరాన్‌కు ఈ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా వినియోగించుకోలేనట్లు పరిమితులు కొనసాగుతాయని, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.  అమెరికా ఇప్పటికే అదనంగా 440 మిలియన్ బ్యారెల్స్ చమురును మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోందని బెసెంట్ తెలిపారు.  దేశీయ ఉత్పత్తి పెంపుతో ఇంధన భద్రతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, ఈ వారం 119.50 డాలర్ల వరకు పెరిగింది. ఇదే సమయంలో అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా గ్యాలన్‌కు 3 డాలర్ల నుంచి 3.99 డాలర్లకు పెరిగాయి.