పశ్చిమాసియాలో శాంతి స్థాపనకై ప్రపంచ నేతలకు మోదీ విజ్ఞప్తి

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకై ప్రపంచ నేతలకు మోదీ విజ్ఞప్తి
పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని గ్యాస్ కేంద్రాలపై దాడులతో ప్రపంచ దేశాలకు గ్యాస్ కొరత ఏర్పడనున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తం కావాలని మోదీ కోరారు. పశ్చిమాసియాలో తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపాలని ఆయన గురువారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మన్యుయేల్ మక్రాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఒమన్ సుల్తాన్‌ను విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయేల్, అమెరికా దాడులకు ప్రతిచర్యగా సౌదీ అరేబియాలోని గ్యాస్ రిఫైనరీ కేంద్రాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఫలితంగా ముడి చమురు ధర లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. యుద్ధం ఇలానే కొనసాగితే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సిన ముప్పు తప్పేలా లేదు. దాంతో.. తక్షణమే పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత స్థాపనకు కృషి చేయాలని భారత ప్రధాని ప్రపంచ నేతలను కోరారు.  ఇదే అంశంపై గురువారం ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు, మలేషియా ప్రధాని, ఒమన్ సుల్తాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.

“నా ప్రియమైన స్నేహితుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్‌తో పశ్చిమాసియా యుద్ధం గురించి మాట్లాడాను. తక్షణమే యుద్ధ తీవ్రతను తగ్గించాల్సిన అవసరముందని, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలనే విషయంమై ఆయనతో చెప్పాను. ఆ ప్రాంతంలో శాంతి స్థాపనకు, సుస్థిరత నెలకొనేందుకు అవసమరమైన సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వివరించాను” అంటూ తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.

“నా స్నేహితుడు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మాట్లాడాను. హరి రయా ఐదిల్‌ఫిత్రి పండుగను పునస్కరించుకొని ఆయనకు, మలేషియా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశాను. అనంతరం.. ప్రపంచాన్ని కలవరపరుస్తున్న పశ్చిమాసియాలో యుద్ధం గురించి ద్దరం చర్చించాం. చర్చల ద్వారా, రాయబారం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, వీలైనంత తొందరగా శాంతి స్థాపనకు, సుస్థిరత నెలకొల్పడానికి కృషి చేయాల్సిన అవసరముందని ఇరువురం భావించాం” అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

“నా సోదరుడు సుల్తాన్ హైథమ్ బిన్ తారీఖ్‌తో సంభాషణ అర్ధవంతంగా సాగింది. ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశాను. పశ్చిమాసియాలో శాంతి స్థాపన అత్యవసరమని, అక్కడ సుస్థిరత ఏర్పాటు గురించీ మాట్లాడుకున్నాం. ఒమన్ సౌర్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా దాడులు చేయడాన్ని భారత్ ఖండిస్తుందనే విషయాన్ని మరోమారు తెలియజేశాను” అని ప్రధాని వెల్లడించారు. 

భారతీయులతో పాటు వేలాది మందిని సురక్షితంగా తరలించినందుకు ఒమన్ ప్రభుత్వం కృషిని అభినందిస్తూ హర్మూజ్ జలసంధి గుండా సురక్షితంగా, స్వేచ్ఛగా రాకపోకలు జరిగాలనే మాటకు భారత్, ఒమన్ కట్టుబడి ఉన్నాయని మోదీ తెలిపారు.